Maha Kumbh Mela Effect: ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పుణ్య స్నానాలు చేసేందుకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. మూడు నదులు కలిసే పుణ్య ప్రదేశంలో స్నానం ఆచరిస్తున్నారు. 140 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా సందర్భంగా సంగమంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది రైళ్ల ద్వారా ఉత్తరప్రదేశ్ కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, రైళ్లలో ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఓ రైళ్లో ఖాళీ ప్లేస్ లేకపోవడంతో భక్తులు ఏకంగా రైలు ఇంజిన్ లోకి ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారణాసిలో రైలు ఇంజిన్ లోకి ఎక్కిన భక్తులు
ఈ వైరల్ వీడియో వారణాసి కంటోన్మెంట్ స్టేషన్ లో తీశారు. వారణాసి నుంచి ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రైల్వే స్టేషన్ కు తరలి వచ్చారు. రైలు బోగీలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కనీసం, రైల్లో కాలు పెట్టేందుకు ప్లేస్ లేదు. ఏం చేయాలో తెలియక కొంత మంది ప్రయాణీకులు రైలు ఇంజిన్ లోకి ఎక్కారు. సుమారు 20 నుంచి 30 మంది స్త్రీలతో పాటు పురుషులు లోకో మోటివ్ లోకి వెళ్లారు. లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. ఈ నెల 8న తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది.
ఇంజిన్ నుంచి భక్తులను కిందికి దించిన రైల్వే పోలీసులు
ఇంజిన్ లోకి భక్తులు ఎక్కడంతో లోకో పైలెట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులను రంగంలోకి దిగారు. రైలు ఇంజిన్ దగ్గరికి చేరుకుని లోపలికి వెళ్లిన భక్తులకు నచ్చజెప్పారు. ఇంజిన్ లోకి వెళ్లడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని విరించి చెప్పారు. చివరకు వాళ్లందరినీ కిందికి దింపారు. ఆ తర్వాత వాళ్లందరినీ మరో రైల్లో ఎక్కించి ప్రయాగరాజ్ కు పంపించారు.
ये तो हाल है रेलवे का. यात्री ट्रेन के इंजन में घुसे जा रहे हैं. तस्वीर वाराणसी की है.
यह महाकुंभ स्पेशल ट्रेन का हाल है. यात्रियों ने इंजन में घुस पॉयलट के जगह पर क़ब्ज़ा कर लिया .फिर जैसे तैसे RPF ने इन जबरन घुसे यात्रियों को बाहर निकाला. pic.twitter.com/G4Dm7nT5Xf
— राहुल ग़ाज़ियाबाद (@RahulGhaziabadd) February 10, 2025
ఇప్పటికే పుణ్యస్నానాలు చేసిన 40 కోట్ల మంది భక్తులు
ఇక జనవరి 13 మహా కుంభమేళా ప్రారంభం కాగా, యూపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 40 కోట్ల మంది ప్రయాగరాజ్ ను సందర్శించారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మహాకుంభ మేళా ముగిసే సరికి సుమారు 45 కోట్ల మంది భక్తులు వస్తారని యోగీ సర్కారు అంచనా వేసింది. అయితే, ఇప్పుడు ఆ సంఖ్య 50 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ భక్తులతో కిక్కిరిసిపోయింది.
Read Also: కుంభమేళా భక్తులకు షాక్, ప్రయాగరాజ్లోని సంగం రైల్వే స్టేషన్ మూసివేత!