Indian Railway: పంజాబ్ లోని లుధియానా రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. కత్రాకు వెళ్లే ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రెండు కోచ్ ల మధ్య ఉన్న కప్లింగ్ తెగిపోవడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై స్టేషన్లో పరుగులు తీశారు.
ఈ ఘటన ఉదయం సుమారు 9 గంటల సమయంలో ప్లాట్ ఫామ్ నంబర్-2 లో జరిగింది. న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కత్రాకు వెళ్లే ప్రత్యేక రైలు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో రెండు స్లీపర్ కోచ్ లను కలిపే మెకానికల్ కప్లింగ్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో కోచ్లు ఒకదానికొకటి విడిపోయాయి.
కప్లింగ్ తెగిన సమయంలో వచ్చిన భారీ శబ్దం స్టేషన్ అంతటా మారుమోగింది. పలువురు ప్రయాణికులు దానిని పేలుడు శబ్దంగా భావించి భయపడ్డారు. కొందరు తమ సామాను కూడా తీసుకోకుండా కోచ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్టేషన్లో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. కప్లింగ్ కు సమీపంలో ఉన్న టాయిలెట్ భాగం కూడా ఈ ఘటనలో దెబ్బతింది. స్లీపర్ కోచ్ లోని టాయిలెట్ ఫ్లోర్ పగిలిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగకపోవడం ఊరట కలిగించింది.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. దెబ్బతిన్న భాగాలను సరిచేసి, కోచ్ లను మళ్లీ లింక్ చేశారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత రైలు బయల్దేరింది. ప్రభుత్వ రైల్వే పోలీస్అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కప్లింగ్ విరిగిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని, ఎలాంటి పేలుడు జరగలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ ఘటన కారణంగా రైలు దాదాపు రెండున్నర గంటల పాటు ఆలస్యమైంది. చివరకు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కత్రా వైపు బయలుదేరింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కప్లింగ్ ఎందుకు తెగిపోయిందనే విషయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. సాంకేతిక లోపమా? మెయింటెనెన్స్ లో ఏవైనా సమస్యలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?