Indian Railways: భారతీయ రైల్వే సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో నాలుగో స్థానాన్ని పొందింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రోజూ సుమారు 2 నుంచి 3 కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. ట్రైన్ జర్నీ చేయాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా లేదంటే ఆఫ్ లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. ఒకవేళ టికెట్ లేని ప్రయాణం చేస్తూ టీసీకి దొరికితే జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇదేదో స్పెషల్ ఆఫర్ కాదు. దశాబ్దాలుగా ఈ రైలు ప్రయాణీకులను ఉచితంగానే సేవలు అందిస్తున్నది.
టికెట్ లేని ప్రయాణం అందించే రైలు ఎక్కడ ఉందంటే?
భారతదేశంలో టికెట్ లేకుండా ప్రయాణీకులను తీసుకెళ్లే ఏకైక రైలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మధ్యలో నడుస్తున్నది. దీని పేరు భాక్రా-నంగల్ రైలు. ఈ రైల్లో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా ఈ రైల్లో ఉచితంగా వెళ్లొచ్చు. ఈ రైలు భాక్రా-నంగల్ డ్యామ్ సమీపంలో సుమారు 13 కిలో మేటర్ల మేర తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ స్పెషల్ ట్రైన్ లో జర్నీ చేసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రయాణీకులు తరలి వస్తారు.
ఈ రైలును ఎప్పుడు.. ఎందుకు ప్రారంభించారంటే?
నిజానికి ఈ రైలును చరిత్ర దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో మొదలయ్యింది. నాటి ప్రధాని నెహూ తీసుకొచ్చిన తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1948లో భాక్రా-నంగల్ డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం కోసం పని చేసే కార్మికులు, అవసరం అయిన సామాగ్రిని తీసుకెళ్లేందుకు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్యామ్ పూర్తయిన తర్వాత ఈ రైలును స్థానికులతో పాటు పర్యాటకుల కోసం ఉచితంగా నడపడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచితంగా ఈ రైలు సేవలు కొనసాగుతున్నాయి.
తొలుత స్టీమ్ ఇంజిన్, ఇప్పుడు ఆధునిక ఇంజిన్లు
భాక్రా-నంగల్ రైల్వే సర్వీస్ ప్రారంభం అయిన తొలినాళ్లలో స్టీమ్ ఇంజిన్ ను ఉపయోగించారు. సుమారు 6 సంవత్సరాల పాటు సేవలు అందించాయి. 1953లో స్టీమ్ రైళ్ల స్థానంలో లేటెస్ట్ ఇంజిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అమెరికా నుంచి 3 రైలు ఇంజిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ఇంజిన్లు మారుతూ వస్తున్నాయి.
భాక్రా-నంగల్ ట్రైన్ జర్నీ టైమింగ్స్
ఈ ఫ్రీ రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి పొద్దున్నే 7:05 గంటలకు బయల్దేరుతుంది. 8:20 వరకు భాక్రాకు చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3:05 గంటలకు నంగల్ నుంచి బయల్దేరి సాయంత్రం 4:20కి భాక్రా రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ప్రతి రోజూ సుమారు 800 మంది ప్రయాణిస్తున్నారు.
Read Also: స్టీమ్ రైల్లో వైఫై కోసం నేరుగా శాటిలైట్ తో లింక్, అధికారుల సరికొత్త ఆలోచన!