Indian Railway: కన్ఫార్మ్ టికెట్లు ఉన్నప్పటికీ, ప్రయాణికులకు సీట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం పట్ల వినియోగదారుల కమిషన్ సీరియస్ అయ్యింది. బాధిత ప్రయాణికులకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా టిక్కెట్ బుకింగ్ మొత్తాన్ని కూడా వడ్డీతో తిరిగి చెల్లించాలని తేల్చి చెప్పింది.
ఫిర్యాదుదారుడు రవి శంకర్ పాండే తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎల్టిటి పాట్నా ఎక్స్ ప్రెస్ లో వింధ్యాచల్ నుంచి ఆరా వరకు ప్రయాణించేందుకు ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేశాడు. వీరికి బి4 కోచ్ లో బెర్తులు కేటాయించబడ్డాయి. అయితే, రైలు ఎక్కిన తర్వాత తమ సీట్లలో ఇతర వ్యక్తులు కూర్చున్నారు. వారిని తమ బెర్త్ లను ఖాళీ చేయాలని కోరినా, పట్టించుకోలేదు. వారు తమను రైల్వే ఉద్యోగులమని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని బాధితులు తెలిపారు. చివరికి కన్ఫార్మ్ టిక్కెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ఈ ఘటన కారణంగా తాము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఫిర్యాదుదారుడు భోజ్పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ రికార్డులో ఉన్న ఆధారాలను పరిశీలించింది. ప్రయాణికులు నిజంగానే ఇబ్బందులు ఎదుర్కొన్నారని అభిప్రాయపడింది. ధృవీకరించిన టిక్కెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులకు సీట్లు అందించడంలో రైల్వే శాఖ విఫలమైందని స్పష్టం చేసింది. ఇది రైల్వే సర్వీసులో లోపంగా అభిప్రాయపడింది. ప్రయాణికులు పలుమార్లు సహాయం కోరినా సమస్యను పరిష్కరించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని వ్యాఖ్యానించింది.
విచారణ అనంతరం నార్త్ సెంట్రల్ రైల్వే, రైల్వే బోర్డును కలిపి ఫిర్యాదుదారులకు టిక్కెట్ బుకింగ్ మొత్తం రూ.1,876.80ను 8 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేధింపులకు గాను రూ.20 వేల నష్టపరిహారం, కేసు ఖర్చుల కింద మరో రూ.15 వేల చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించాలని కమిషన్ పేర్కొంది.
అటు రైల్వే శాఖ మాత్రం ఈ ఆరోపణలను వ్యతిరేకించింది. ఈ వివాదం శాంతిభద్రతలకు సంబంధించినదని, దీనిపై ప్రభుత్వ రైల్వే పోలీసులే చర్య తీసుకోవాల్సి ఉంటుందని వాదించింది. తమ నుంచి ఎలాంటి సర్వీస్ లోపం జరగలేదని తెలిపింది. అయితే, కమిషన్ ఈ వాదనలను తిరస్కరించింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించడంలో రైల్వే శాఖ విఫలమైందని తేల్చిచెప్పింది. నిర్ణీత సమయంలోగా డబ్బు చెల్లించకపోతే 10 శాతం వడ్డీతో వసూలు చేసుకునే హక్కు ఫిర్యాదుదారులకు ఉంటుందని కూడా కమిషన్ స్పష్టం చేసింది.
Read Also: పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు.. మాన్సూన్ ట్రిప్స్ కు బెస్ట్ ప్లేసెస్ ఇవే!