Pink Elephant Photoshoot: ఫోటోగ్రాఫర్లు మంచి గుర్తింపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల కెమెరా కన్నుకు చిక్కిన అద్భుతమైన ఫోటోలు ఆహా అనిపిస్తాయి. అయితే, తాజాగా తన ఫోటోలు కూడా బాగా పాపులర్ కావాలని ఓ ఫారిన్ ఫోటో గ్రాఫర్ జైపూర్ ఫోటో షూట్ చేసింది. ఇప్పుడు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సదరు ఫోటోగ్రాఫర్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన ఓ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి కారణం అయ్యింది. విదేశీ ఫోటోగ్రాఫర్ తన ఆర్ట్ ప్రాజెక్ట్ కోసం నిజమైన ఏనుగుకు గులాబీ రంగు వేసి ఫోటోలు తీయడంతో, ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జూలియా బురులేవా అనే ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో షూట్ చేసిన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వాటిని షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలు వెల్లడించింది. రాజస్థాన్ సంస్కృతిలో ఏనుగులకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే జైపూర్ నగరం పింక్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండింటిని కలిపి ఒక ప్రత్యేక కాన్సెప్ట్ రూపొందించాలనే ఆలోచనతో ఆమె ఈ షూట్ చేసింది. అందుకే, ఏనుగుకు గులాబీ రంగు వేసి, రాజస్థానీ వాస్తుశిల్పం నేపథ్యంలో మోడల్ తో కలిసి ఫోటోలు తీసింది. ఈ షూట్ కోసం ఆమె చాలా కష్టపడ్డానని కూడా చెప్పుకొచ్చింది. సరైన లొకేషన్ కోసం వెతకడం, పర్మీషన్ తీసుకోవడం, ఏనుగును వెతికిపట్టుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చింది. చివరకు ఓ పాత గణపతి టెంపుల్ దగ్గర ఈ షూట్ చేసినట్లు వెల్లడించింది. ఎలాంటి కెమికల్ లేని గులాబీ రంగును ఏనుగుకు వేసినట్లు చెప్పింది.
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణం అయ్యాయి. చాలామంది నెటిజన్లు ఏనుగుకు ఇలా రంగులు వేసి ఫోటోలు తియ్యడం ఏంటని మండిపడుతున్నారు. ఇది కళ కాదు, జంతు హింస అంటూ కొందరు విమర్శించారు. మరికొంత మంది ఏనుగుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు వాటికి ఇబ్బందికరంగా మారవచ్చన్నారు. ఇంకాకొందరు నెటిజన్లు, ఇలాంటి ఫోటోలు తీసేందుకు నిజమైన జంతువును ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? ఏఐ ద్వారా ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయవచ్చుకదా? అని ప్రశ్నించారు. కళాత్మక స్వేచ్ఛ ఉన్నా, అది బాధ్యతతో ఉండాలని మరికొంత మంది ఆమెకు హితవుపలికారు. జంతువులను అలంకరణ వస్తువుల్లా ఉపయోగించడం సరైన విధానం కాదన్నారు.
అటు ఈ విమర్శలపై జూలియా బురులేవా స్పందించింది. తాను ఎలాంటి హానికరమైన పని చేయలేదని వివరించింది. తాను ఉపయోగించిన పెయింట్ పూర్తిగా నేచురల్ కలర్ అని చెప్పింది. షూట్ తర్వాత ఈజీగా తొలగించినట్లు చెప్పింది. డిజిటల్ టూల్స్ తో ఫోటోలు క్రియేట్ చేసే అవకాశం ఉన్నా, అవి నిజ జీవిత అనుభూతిని అందించవని అభిప్రాయపడింది.
Read Also: ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ స్పెషల్ షురూ, నీలగిరి అందాలు చూసేయండి!