India : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కశ్మీర్లోని అత్యంత క్లిష్టతరమైన ప్రాంతంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన రైల్వే ఆర్చి బ్రిడ్జ్ నిర్మాణం.
ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్పై ఇంజనీరింగ్ వండర్. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా.. ఈ మూడు ప్రదేశాలను కనెక్ట్ చేసే రైల్వే ప్రాజెక్ట్లో భాగంగా చీనాబ్ నదిపై వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జ్ బ్రేక్ చేసింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ఇంకా 30 మీటర్లు ఎక్కువగానే ఉంటుంది.
వందే భారత్ ట్రైన్లో మార్పులు
272 కిలోమీటర్ల పొడవున్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.43,780 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 36 టన్నెల్స్, 943 బ్రిడ్జ్లు ఉన్నాయి. కశ్మీర్ వ్యాలీని మిగతా దేశంతో కనెక్ట్ చేసే ఈ ప్రాజెక్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జిపై పరుగులు తీసే వందే భారత్ ట్రైన్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా ట్రైన్కు కొన్ని మార్పులు చేశారు. అతి శీతల వాతావరణం ఉండటంతో నీరు గడ్డకట్టకుండా ఉంచేందుకు అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
130 ఏళ్ల డ్రీమ్..
శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ ఓ రైలు ప్రాజెక్ట్ను నిర్మించాలనేది వందేళ్ల క్రితం వచ్చిన ఆలోచన. బ్రిటిష్ పరిపాలనలోనే ఈ కొండల సర్వేకు ఇంజినీర్లను నియమించినా.. ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 1983 వరకు కేవలం 65 కిలోమీటర్ల దూరం పాటు నిర్మాణం పూర్తి చేశారు. వాజ్పేయి ప్రధాని అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. 2001లో జాతీయ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేశారు. 2007లోపు పూర్తి చేయాలని అప్పట్లో డెడ్లైన్ విధించారు. కానీ ఆ డేట్ మారుతూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ప్రాజెక్ట్ పూర్తైంది. ఇప్పటికే బ్రిడ్జ్పై ట్రయల్రన్ను పూర్తి చేశారు రైల్వే అధికారులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్పై నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. శ్రీమాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణించింది. జూన్ 6 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.