Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
ఇక మొట్టమొదటిసారి ప్రభాస్ రాజాసాబ్ లో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తాత మనవడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఎన్నో వాయిదాల తరువాత చివరకు రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే గత కొన్నేళ్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు అయినా కూడా ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు పరాజయాన్ని చవిచూస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలన్నీ రాజా సాబ్ సినిమా మీదనే పెట్టుకుంది అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ సినిమా అంటే బిజినెస్ కూడా బాగా గట్టిగానే జరుగుతుంది. ఈనెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. టీజర్ చూశాక ఆ బిజినెస్ లెక్కలు మారొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాజాసాబ్ కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక కల్కి తర్వాత డార్లింగ్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజాసాబ్ కు మాత్రం డార్లింగ్ రూ. 50 కోట్లు తగ్గించుకొని రూ. 100 కోట్లు మాత్రమే తీసుకున్నాడని టాక్ నడుస్తుంది.
అయితే రాజా సాబ్ సినిమాకు మాత్రమే ఎందుకు పారితోషికం తగ్గించాడు అనేదానికి కారణం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఆదిపురుష్ సినిమాతో జరిగిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగు హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే కొనుగోలు చేసి రిలీజ్ చేసింది. దీనివల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా నష్టపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత విశ్వప్రసాద్ కు కొద్దిగా భారాన్ని తగ్గించడానికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫాన్స్ ఆయన మంచి మనసుని ప్రశంసిస్తున్నారు. మరి ఈ సినిమాతో డార్లింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.