1 KM Metro cost India: మనమంతా రోజూ రైలు ప్రయాణం చేస్తాం. టైమ్ కంటే ముందే స్టేషన్కు చేరుకుంటాం. ప్లాట్ఫాం మీద నిలబడి ట్రైన్ రాగానే దూకేస్తాం. కానీ మనం ప్రయాణించే ఆ ట్రైన్ వెనక ఉన్న మౌలిక సదుపాయాల వ్యవస్థ ఎంత ఖర్చుతో పనిచేస్తుందో చాలా మందికి తెలీదు. ఒక రైలు పట్టాల ఏర్పాటుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతాయో తెలుసుకుంటే అసలే ఆశ్చర్యం వేస్తుంది.
అమ్మో.. ఇన్ని కోట్లా!
ఒక కిలోమీటరు రైల్వే ట్రాక్ను నిర్మించడానికి సగటుగా రూ. 12 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంట్లో భూమి కొనుగోలు, అధునాతన సాంకేతికత, పెట్టుబడులు, ట్రాక్ వేసే పని, సేఫ్టీ ఫీచర్లు, అన్నీ కలిపి ఈ లెక్క వస్తోంది. అయితే ఇది సాదారణ ట్రాక్కు మాత్రమే. ఎలివేటెడ్ ట్రాక్లు, స్టీల్ బ్రిడ్జులు ఉండే ప్రాంతాల్లో ఈ ఖర్చు ఇంకాస్త పెరుగుతుంది.
మన ట్రాక్ రికార్డ్ పెద్దే!
ఇప్పుడు మన దేశ రైల్వే వ్యవస్థ మొత్తం మీదకి వస్తే, భారత రైల్వే వ్యవస్థలో దాదాపు 1,35,000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది. అంటే ఈ మొత్తం ట్రాక్ వేసేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చయి ఉండొచ్చో ఊహించండి.. ఈ స్థాయిలోని మౌలిక వనరుల నిర్వహణ అన్నది ఒక పెద్ద బాధ్యత. అందులో మెయింటెనెన్స్ ఖర్చు కూడా గణనీయమే.
ఇది మీకు తెలుసా!
ప్రస్తుతం ఒక కిలోమీటరు రైల్వే ట్రాక్ను నిర్వహించడానికి సంవత్సరానికి సగటుగా రూ. 6 లక్షలు ఖర్చవుతోంది. అంటే మొత్తానికి 1,35,000 కిలోమీటర్ల ట్రాక్ను నిర్వహించడానికి ఏటా సుమారు రూ. 8,100 కోట్లు ఖర్చవుతోంది. ఇది కేవలం ట్రాక్ మెయింటెనెన్స్ ఖర్చే. ట్రైన్ల నడుపు, సిబ్బంది జీతాలు, ఫ్యూయల్, సిగ్నలింగ్ వ్యవస్థ, స్టేషన్ల నిర్వహణ వంటివి ఇంకా వేరే.
మెట్రో వెనుక అసలు సంగతి..
ఇంకొక వైపు నగరాల్లో వాహన రద్దీ పెరుగుతోందనే కారణంగా మెట్రో రైలు ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి పెద్దపెద్ద నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు విస్తృతంగా చేపడుతున్నారు. కానీ ఈ మెట్రో ట్రాక్ ఏర్పాటుకు ఖర్చు అంటే తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే. ఒక కిలోమీటరు మెట్రో ట్రాక్ నిర్మించేందుకు సగటుగా రూ. 250 కోట్లు ఖర్చవుతోంది. అవును, ఇది నిజం.. ఇది ఎలివేటెడ్ లేదా అండర్గ్రౌండ్ ప్రాజెక్టులపై ఆధారపడి మారుతుంది.
అండర్గ్రౌండ్ మెట్రో పనులు అయితే ఇంకా ఖర్చుతో కూడుకున్నవే. భూమిలో తవ్వకాలు, స్పెషల్ టన్నెల్స్, ఎస్కలేటర్స్, స్టేషన్ల నిర్మాణం ఇలా అన్నీ కలిపి ఒక్క కిలోమీటరుకు రూ. 300 కోట్లు దాటి పోతున్న సందర్భాలూ ఉన్నాయి. ఇది ప్రజలకు ఒక రకమైన సౌలభ్యం ఇవ్వడమే కాకుండా, భవిష్యత్ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కావడంలో భాగం. కానీ ఈ తీరుగా వెళ్తే నగరాల అభివృద్ధికి పెట్టుబడుల పరంగా రికార్డ్ స్థాయిలో డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ రెండు లెక్కలు చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. రైలు ప్రయాణం తక్కువ ధరకే అందుబాటులో ఉన్నా, దాని వెనక నడిచే ఖర్చులు మాత్రం మామూలుగా లేవు. పట్టాల నిర్వహణ, సేవల మెరుగుదల, కొత్త మార్గాల అభివృద్ధి వంటి వాటికే లక్షల్లో కాదు, కోట్లలో ఖర్చవుతోంది.
భవిష్యత్ లో ఖర్చు తగ్గేనా? పెరిగేనా?
ఒకవేళ రైల్వే శాఖ ఖర్చులు తగ్గించాలంటే మెరుగైన ప్లానింగ్, సాంకేతికత ఆధారిత మైంటెనెన్స్ మోడళ్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ట్రాక్ ఇన్స్పెక్షన్ కోసం డ్రోన్లు, AI టెక్నాలజీ, సెన్సర్లను ఉపయోగించడం మొదలయ్యింది. దీనివల్ల మానవ లోపాలను తగ్గించవచ్చు. అలాగే అధునాతన రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫాం ఎలివేషన్, న్యూ జనరేషన్ కోచ్లు వంటి వాటిపై మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి.
మరోవైపు మెట్రో రైళ్ల ద్వారా నగరాల్లో ప్రయాణించే ప్రజలకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పర్యావరణ దృష్టికోణంలో కూడా ఉపయోగపడుతోంది. అయితే ఈ సదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వాలు తలకిందులవుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం లాంటి విధానాల ద్వారానే ఈ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ట్రైన్లో కూర్చొని చల్లగా ప్రయాణిస్తున్నప్పుడు, ఆ పట్టాల వెనక కదులుతున్న ఖర్చుల ట్రైన్ అలానే పరుగులు తీస్తోంది. రైలు అన్నదే కదా.. గమ్యం చేరుకుంటుంది. కానీ గమ్యానికి ముందు ప్రయాణం ఎంత ఖర్చుతో సాగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరిదీ కూడా ఉంది.