SCR Awards: దక్షిణ మధ్య రైల్వేలో ఉత్తమ నిర్వహణ రైలు అవార్డును ఐకానిక్ గోదావరి ఎక్స్ప్రెస్ గెలుచుకుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడుస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ (రైలు నం. 12727/12728)కు ‘ఉత్తమ నిర్వహణ లాంగ్-డిస్టెన్స్ ట్రైన్ ఆపరేటింగ్ షీల్డ్’ అవార్డు దక్కింది. గురువారం న్యూ బోయిగూడ రైల్ కలారంగ్లో జరిగిన 70వ రైల్వే వారోత్సవాల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పాల్గొని అవార్డులు అందజేశారు. హైదరాబాద్, గుంతకల్ డివిజన్లకు ‘ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్’ను అందించారు.
జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కస్టమర్ సర్వీస్, నిర్వహణ, ప్రొడక్షన్, కార్యకలాపాలలో.. సంస్కరణలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రైల్వే సిబ్బంది నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భద్రత, సాంకేతిక పురోగతిపై ప్రత్యేక ప్రాధాన్యతతో భారతీయ రైల్వేలు నిరంతర ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్.. డివిజన్లు, వర్క్షాప్లకు 35 జోనల్ లెవల్ షీల్డ్లను ప్రదానం చేశారు.
సికింద్రాబాద్ డివిజన్ కు ఫైనాన్స్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్, మెకానికల్, ట్రాక్(గుంతకల్లుతో భాగస్వామ్యం), సివిల్ ఇంజినీరింగ్ (విజయవాడతో భాగస్వామ్యం), స్టేషన్ పరిశుభ్రత (గుంటూరుతో భాగస్వామ్యం) అవార్డు దక్కింది. అలాగే హైదరాబాద్ డివిజన్ కు హౌస్ కీపింగ్, సిగ్నల్, టెలికాం, ఎఫిషియన్సీ షీల్డ్(గుంతకల్తో భాగస్వామ్యం) అవార్డు లభించింది.
Also Read: ఏపీ వెళ్తున్నారా? 15కు పైగా రైళ్ల రద్దు, పూర్తి లిస్ట్ ఇదే!
విజయవాడ డివిజన్ కు వాణిజ్య, విద్యుత్, హెచ్ఆర్డీ, సివిల్ ఇంజినీరింగ్ (సికింద్రాబాద్తో భాగస్వామ్యం)లో అవార్డు దక్కింది. గుంతకల్ డివిజన్ కు కార్యకలాపాలు, రన్నింగ్ రూమ్ నిర్వహణ, లెవల్ క్రాసింగ్ల తొలగింపు (నాందేడ్తో భాగస్వామ్యం), ఫిర్యాదుల పరిష్కారం విభాగాల్లో అవార్డులు పొందింది. మొత్తం 86 మంది సిబ్బంది వ్యక్తిగత అవార్డులను అందుకున్నారు.