Secunderabad–Anakapalli Regular Express Services: సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు తాత్కాలికంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఇకపై రెగ్యులర్ సర్వీసులుగా మారనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఈ రూట్ లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ముందుగా ఈ రైళ్లు ట్రైన్ ఆన్ డిమాండ్ విధానంలో మాత్రమే నడిచేవి. అంటే, అవసరాన్ని బట్టి రాకపోకలు కొనసాగించేవి. కానీ, ఇప్పుడు రెగ్యులర్ గా నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లుగా మారడం ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు ఇప్పుడు కొత్త నంబర్లతో రెగ్యులర్ ట్రైన్గా మారింది. ముందు 07041/07042 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇప్పుడు 17043/17044గా మారి సర్వీసులు అందించనుంది. ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, సోమవారం సాయంత్రం అనకాపల్లి నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం సికింద్రాబాద్కు చేరుతుంది. ఈ రైలు ప్రయాణంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట వంటి స్టేషన్లలో హాల్ట్ ఉండటం వల్ల మధ్యలో ఎక్కే ప్రయాణికులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రైలులో ఆధునిక LHB కోచ్లు ఉండడం వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
అటు చర్లపల్లి నుంచి అనకాపల్లి వరకు నడిచే మరో ప్రత్యేక రైలు కూడా ఇప్పుడు రెగ్యులర్ సర్వీస్గా మారింది. ఇది ముందుగా 07035/07036 నంబర్లతో నడిచేది. ఇప్పుడు దీనికి 17045/17046 నంబర్లు కేటాయించారు. ఈ రైలు ప్రతి శనివారం రాత్రి చర్లపల్లి నుంచి బయలుదేరి, ఆదివారం అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా అదే రోజు సాయంత్రం బయలుదేరి, తిరిగి చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఏలూరు లాంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 24 ICF కోచ్లు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు.
ఈ రెండు రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చాలనే నిర్ణయం ముందే తీసుకున్నప్పటికీ, అమలులోకి రావడానికి కొంత సమయం పట్టింది. కోచ్ల ఏర్పాటు, టైమ్ టేబుల్ సర్దుబాటు, టికెట్ బుకింగ్ సిస్టమ్ మార్పులు వంటి పనుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మొత్తంగా ఇప్పటికైనా రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణీకులు సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో తరచుగా ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు ప్రయాణికులు ఈ రైళ్లను విశాఖపట్నం వరకు పొడిగించాలని కూడా సూచిస్తున్నారు. అలా చేస్తే మరింత మంది ప్రయాణికులకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!