Charlapalli Railway Station Faces Mosquito Problem: హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం అయితే చాలు, దోమలతో ప్రయాణికులు వేగలేకపోతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో, ప్లాట్ ఫారమ్లపై కూర్చోవాలన్నీ, నిలబడాలన్నీ కష్టంగా మారుతోంది. దోమల దాడి నుంచి తప్పించుకోవడానికి చాలామంది నానా అవస్థలు పడుతున్నారు.
ప్రయాణికులు ముఖ్యంగా రైళ్ల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు దోమల సమస్యను తట్టుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ పరిస్థితిని భరించడం చాలా కష్టంగా మారుతోంది. కొందరు ప్రయాణికులు తమ దగ్గర ఉన్న దోమల క్రీములు, స్ప్రేలు వాడుకుంటున్నా, అవి కూడా పూర్తిగా ఉపశమనం ఇవ్వడం లేదని చెబుతున్నారు. మరికొంత మంది స్టేషన్ పరిధిలోనే చెట్టు కొమ్మలను విరుచుని వాటితో దోమలను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది ఏకంగా మస్కిటో కాయిల్స్ వెలిగించి పట్టుకుంటున్నారు.
తాజాగా చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఓ యువకుడు వీడి తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వామ్మో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అత్యాధునిక రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఇంతలా ఇబ్బందులు పడటం బాధగా ఉందంటున్నారు.
స్టేషన్ పరిసరాల్లో శుభ్రత లోపం, నీటి నిల్వలు వంటి కారణాల వల్ల దోమలు పెరిగినట్టు ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, వేసవి కాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల సంఖ్య మరింత పెరిగినట్లు వెల్లడిస్తున్నారు. దోమల సమస్యను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే అధికారులు ఈ పరిస్థితిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ లో ఫాగింగ్ నిర్వహించడం, నీటి నిల్వలను తొలగించడం, శుభ్రతను మెరుగుపరచడం లాంటి చర్యలు తీసుకుంటే కొంతవరకు సమస్య తగ్గవచ్చంటున్నారు.
ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉండటంతో, వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటున్నారు. చర్లపల్లి స్టేషన్ లోని ఈ సమస్య త్వరగా పరిష్కారమై, ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణం చేయగలిగే పరిస్థితులు రావాలని అందరూ కోరుకుంటున్నారు.
Read Also: హైదరాబాద్ కు హైస్పీడ్ రైలు.. ఏకంగా బెంగళూరు, చెన్నై, పూణేను కలుపుతూ!