Stone Pelting on Vande Bharat: గంటన్నర వ్యవధిలో మూడు రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంపై రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.
బీహార్ లో ఆదివారం సాయంత్రం జరిగిన వరుస రాళ్ల దాడులు రైల్వే ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించాయి. ముజఫర్ పూర్ సమీపంలో కేవలం గంటన్నర వ్యవధిలో మూడు రైళ్లపై దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనల్లో పలు కోచ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దాడికి గురైన రైళ్లలో ఓ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రైలు పాటలీపుత్ర నుంచి గోరఖ్ పూర్ వెళ్తుండగా ముజఫర్ పూర్ జంక్షన్, రామ్ దయాళ్ నగర్ స్టేషన్ మధ్య రాళ్ల దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 26501)పై మఝౌలియా, ఖబ్రా ప్రాంతాల సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో మూడు కోచ్ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అద్దాలు పగలడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే, ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.
వందే భారత్ ఘటన తర్వాత కూడా దుండగులు ఆగలేదు. అదే మార్గంలో కొద్దిసేపటి వ్యవధిలో మరో రెండు రైళ్లపై కూడా రాళ్ల దాడి జరిగింది. పాట్నా–జయనగర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, అలాగే లిచ్ఛవి ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కిటికీల దగ్గర కూర్చున్నవారు ఒక్కసారిగా భయంతో సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. కొంతసేపు రైళ్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ముజఫర్ పూర్, హాజీపూర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను పంపించి దర్యాప్తు ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రైల్వే ట్రాక్ల సమీపంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్ల దగ్గర ఆడుకుంటున్న పిల్లలు సరదాగా రాళ్లు విసిరి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇది కావాలనే చేసిన దాడి అయ్యి ఉండొచ్చనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. లేదంటే, కొందరు ఉద్దేశపూర్వకంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగించాలనే ప్రయత్నం చేశారా? అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే పోలీసులు సమీప గ్రామాల్లో విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి సమాచారం సేకరిస్తున్నారు.
Read Also: విశాఖ నుంచి ఢిల్లీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!