Travel App: స్వేచ్చ బ్యూరో: పర్యాటకులకు త్వరలోనే పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. కుటుంబంతో సహా విహార యాత్రలకు వెళ్లే పర్యాటకులకు టికెట్లు బుకింగ్ సులభతరం చేయబోతుంది. ఆఫీసులకు వెళ్లి గంటల తరబడి వేచి చూడకుండా ఫోన్లోనే టికెట్ల బుకింగ్ చేసేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆ టికెట్ల బుకింగ్ సైతం పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపడుతుంది. పర్యాటక శాఖ పర్యాటకులకు టూరిజ ప్రాంతాల్లో హరిత హోటల్స్ బుకింగ్, బోటింగ్ సౌకర్యాలు బస్సు ప్యాకేజీలు తదితర వివరాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు అధికారులతో పర్యాటక శాఖ అధికారులు సమావేశం నిర్వహించి పలు అంశాలను చర్చించారు. అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వాట్సాప్లో టూరిజం టికెట్లు
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అన్ని సేవలు ఆండ్రాయిడ్ ఫోన్లోనే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం సమాజంలో జరిగే వివరాలను క్షణాల్లో తెలుసుకుంటున్నారు. సమయాన్ని వృధా చేయకుండా సేవలను పొందుతున్నారు. ఈ తరుణంలోనే టూరిజం శాఖ సైతం ఆన్లైన్ లో వాట్సాప్ బుకింగ్ ద్వారా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రైవేట్ రంగ సంస్థ అయినా.. కొటక్ మహీంద్రా బ్యాంకు తో టూరిజం శాఖ అధికారులు వాట్సాప్ లో టికెట్లు బుకింగ్ చర్చించినట్లు సమాచారం.
ఒక్క క్లిక్తో టూర్ ప్లాన్
ఈ వాట్సప్ తో టూరిజం టికెట్లు, ప్యాకేజీల వివరాలను తెలుసుకోవడంతోపాటు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత హోటల్స్, బోటింగ్, బస్సుల ప్యాకేజీలు, మౌలిక సదుపాయాలు, ఏ టూరిజం ప్రాంతంలో ఎంత ప్యాకేజీ తదితర వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. ఏ రోజు ఏ ప్యాకేజీ అందులో అందుబాటులో ఉంటుంది.. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి.. ఏ ఏ ప్రాంతాల్లో బస్సు సర్వీస్ ల అందుబాటులో ఉన్నాయి.. పండుగల సమయంలో ప్యాకేజీలు ఎలా ఉంటాయి..? కుటుంబంతో వెళ్లే వారికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా ఉంటుందా? పదిమంది ఒకే దగ్గర ఉంటే వారిని పికప్ చేసుకునేందుకు బస్సు సదుపాయాలు కల్పిస్తుందా?.. ఏమైనా రాయితీలు ఇస్తుందా?.. దివ్యాంగులు, వృద్ధులకు ఏమైనా ప్రత్యేక వసతులు కల్పిస్తుందా.. అనే తదితర వివరాలను యాప్ లో ఎప్పటికప్పుడు పొందుపరచనున్నారు. ప్రతి రోజు.. ప్రతి నిమిషం అప్డేట్ ను ఈ యాప్ లో నమోదు చేయనున్నారు. పర్యాటకులకు సేవలు సులభతరం చేయబోతున్నారు.. టూర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే యాప్ ద్వారా వారు వెళ్లాలనుకున్న సమయానికి టికెట్లో బుక్ చేసుకునే అవకాశం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
పూర్తి ట్రావెల్ ప్లానింగ్ ఇక యాప్లోనే
ఇప్పటికే టూరిజం శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల వివరాలను.. చారిత్రక కట్టడాలు, జలపాతాలు, ఆధ్యాత్మిక క్షేత్రల సమాచారం, సాగర్, గోల్కొండ, ఏకో టూరిజం ప్రాంతాలు, ఆలయాలు, ఇలా ప్రతి పర్యాటక ప్రవేశం వివరాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆయా ప్రదేశాల ప్రత్యేకత ఈ యాప్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఆ ప్రత్యేకతను బట్టి పర్యాటకులు సైతం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని టూరిజం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ తో పర్యాటకులను ఆకర్షించవచ్చని.. దీంతో ప్రభుత్వానికి పేరుతోపాటు ఆదాయం సైతం వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు మించి..
ఇప్పటికే టీటీడీ, ఢిల్లీ మెట్రో, కేరళ, గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించారు. అయితే కొన్ని సేవల వివరాలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మాత్రం పర్యాటక రంగానికి సంబంధించిన అన్ని టూరిజం ప్రాంతాల వివరాలను.. అక్కడి ప్రత్యేకతలను వివరిస్తూ టికెట్లకు సంబంధించి బుకింగ్ వివరాలను సైతం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు. పర్యాటక శాఖలో పారదర్శకత పెంపు కోసమే అందుబాటులో తెస్తున్నట్లు పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
సైబర్ క్రైమ్కు నో ఎంట్రీ
టూరిజం డేటా సైబర్ నేరస్తులు హ్యాక్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీకి సైతం అప్పగించబోతున్నట్లు సమాచారం. టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ నమోదు, ఫోన్ నెంబర్ వివరాలను నమోదు చేసే సందర్భంలో.. పేమెంట్ చెల్లింపు సమయంలో సైబర్ నేర స్తులకు చిక్కకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పకడ్బందీగా యాప్ తో టికెట్ల బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
పర్యాటకులను ఆకర్షించే ప్లాన్స్
పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ.. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మానిటరింగ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షలు, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే టికెట్ల బుకింగ్ సేవలు పర్యాటకులకు సులభతరం చేసేందుకు తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: యవ్వనంలో ఆమె చేసిన పనులు చెప్తుంటే.. ఏం థ్రిల్ ఉంది మామా..