Rampur Nawab’s Royal Train: చరిత్రలో 1947 దేశ విభజన విషాదకరమైన ఘటనగా నిలిచిపోయింది. ఆ సమయంలో లక్షలాది మంది తమ ఇళ్లు, భూములు, కుటుంబాలను వదిలి కొత్త సరిహద్దుల వైపు వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ అల్లకల్లోల సమయంలో ఎన్నో రైళ్లు ప్రజల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి అరుదైన రైళ్లలో ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నవాబు ప్రత్యేక రైలు.
ఈ రైలు సాధారణ రైలు కాదు. రాంపూర్ నవాబు హమీద్ అలీ ఖాన్కు చెందిన ప్రైవేట్ విలాసవంతమైన రైలు. 1925లో నవాబు తన వ్యక్తిగత ప్రయాణాల కోసం దీన్ని ప్రత్యేకంగా నిర్మించించారు. అప్పట్లో రాజులు, నవాబులు తమ కోసం ప్రత్యేక రైళ్లు తయారు చేయించుకోవడం అత్యంత అరుదు. ఈ రైలులో విలాసవంతమైన కోచ్లు, ప్రత్యేక గదులు, అందమైన అలంకరణలు ఉండేవి. వాస్తవానికి రాంపూర్ నవాబు కుటుంబానికి అప్పట్లో ఎంతో గుర్తింపు ఉండేది. బ్రిటిష్ కాలంలో కూడా వారికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. నవాబు హమీద్ అలీ ఖాన్ కళలు, సంగీతం, సాహిత్యానికి పెద్ద పీట వేయడంతో పాటు ప్రజా పాలనలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశ వ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. లక్షలాది మంది ప్రజలు భయంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో రాంపూర్ ప్రాంతంలోని కొంతమంది ప్రజలు పాకిస్తాన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ రోజుల్లో ప్రయాణం అంత సులభం కాదు. రోడ్లు, రైళ్లు అన్నీ గందరగోళంగా మారిపోయాయి.
అప్పుడు నవాబు హమీద్ అలీ ఖాన్ తన ప్రత్యేక రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా రాజ కుటుంబం కోసం ఉపయోగించే ఆ విలాసవంతమైన రైలును వలస వెళ్లే ప్రజల ప్రయాణానికి ఇచ్చారు. ఈ రైలు రాంపూర్ నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ కు బాధితులను చేర్చేందుకు ఉపయోగపడింది. ఆ సమయంలో వందలాది కుటుంబాలు ఈ రైలు ద్వారా సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకున్నాయి. విభజన సమయంలో జరిగిన హింస, భయంకర పరిస్థితుల మధ్య ఈ రైలు చాలామందికి ఆశాకిరణంలా మారింది. ఎంతో మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ ప్రయాణాన్ని ఆశ్రయించారు.
ఆ తర్వాత ఈ ప్రత్యేక రైలు వినియోగం తగ్గిపోయింది. స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాలు, నవాబుల ప్రభావం కూడా తగ్గడంతో ఈ రైలు ఎక్కువగా ఉపయోగించలేదు. తర్వాత నవాబు కుటుంబంలో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఆ వివాదాల కారణంగా ఈ వారసత్వ రైలు నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం ఈ రైలు ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లో ఉన్న ఖాస్ బాగ్ ప్యాలెస్ లో శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు రాజసంగా ప్రయాణించిన ఈ రైలు ఇప్పుడు చరిత్రలో ఒక గుర్తుగా మిగిలిపోయింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్, మన దేశంలోనే ఉంది తెలుసా?