Indian Railways: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లో ఇండియా ఒకటిగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా గమ్య స్థానాలకు చేరుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లు అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లను కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్లను నిర్మించారు. ఇంతకీ దేశంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన రాష్ట్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఉత్తరప్రదేశ్
యూపీలో 9,000 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ఉంది. దేశంలో అత్యధిక రైల్వే నెట్ వర్క్ ఉన్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ప్రయాగరాజ్, కాన్పూర్, వారణాసి, గోరఖ్ పూర్ లాంటి ప్రధాన రైల్వే జంక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కీలకమైన రవాణా కేంద్రాలుగా పని చేస్తున్నాయి. విస్తారమైన నెట్ వర్క్ ప్రయాణీకులతో పాటు సరుకు రవాణా సేలను అందిస్తున్నాయి. దేశంలో కీలకమైన రైల్వే హబ్ గా యూపీ కొనసాగుతోంది.
⦿ రాజస్థాన్
ఇక రాజస్థాన్ 6,000 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. రాష్ట్రంలోని ఐకానిక్ ఎడారి మార్గాలు, ప్యాలెస్ ఆన్ వీల్స్ లాంటి వారసత్వ రైళ్లు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లు సుదూర ప్రయాణానికి, ప్రాంతీయ కనెక్టివిటీకి దోహదపడుతున్నాయి.
⦿ మహారాష్ట్ర
దేశంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన మూడో రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపు తెచ్చుకుంది. ఈ రాష్ట్రంలో 5,800 కిలో మీటర్ల మేర రైల్వేలైన్లు ఉన్నాయి, మహారాష్ట్ర రైల్వే నెట్ వర్క్ వ్యాపార, రోజువారీ ప్రయాణీకులకు కీలకమైనది. ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై, పూణె, నాగ్ పూర్ వంటి కీలక జంక్షన్లు అత్యంత ప్రధానమైన రైల్వే కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.
⦿ మధ్యప్రదేశ్
ఈ రాష్ట్రంలో సుమారు 5,300 కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వారధిగా పనిచేస్తున్నది. భోపాల్, జబల్ పూర్, గ్వాలియర్ ప్రధాన రైల్వే కేంద్రాలుగా పని చేస్తున్నాయి. రాష్ట్రాన్ని దేశంలోని అన్ని మూలలకు కలుపుతాయి. రాష్ట్ర రైల్వేలు బొగ్గు, ఖనిజ రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
⦿ తమిళనాడు
ఈ రాష్ట్రంలో సుమారు 5,200 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. చెన్నై దక్షిణ భారతదేశానికి ప్రవేశ ద్వారంగా పనిచేసే ప్రధాన రైల్వే జంక్షన్ గా కొనసాగుతోంది. ఇది మధురై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి లాంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. రాష్ట్రం తీరప్రాంతంలో అందమైన రైలు మార్గాలను కలిగి ఉంది.
⦿ గుజరాత్
గుజరాత్ లో రైల్వే నెట్ వర్క్ సుమారు 5,000 కిలో మీటర్లలో విస్తరించి ఉన్నాయి. ప్రయాణీకుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అహ్మదాబాద్, సూరత్, వడోదర కీలకమైన జంక్షన్ లుగా ఉన్నాయి. రాష్ట్రాన్ని దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలను ఈ రైల్వే లైన్లు కలుపుతున్నాయి.
Read Also: ఆకాశాన్ని తాకేంత ఎత్తులో రైల్వే స్టేషన్.. ఎక్కడుందో తెలుసా?