కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పర్యాటక ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు IRCTC చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (HPTDC) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య ఒప్పందం కుదిరింది.
తాజా ఒప్పందం ప్రకారం IRCTC రైల్వే టూర్ ప్యాకేజీలను HPTDC హోటళ్లతో లింక్ చేస్తారు. ముఖ్యంగా UNESCO గుర్తించిన హెరిటేజ్ రైల్వే మార్గంలో, హిమాచల్ ప్రదేశ్కు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి పెడుతుంది.ఈ ప్యాకేజీ గురించి, IRCTC చీఫ్ రీజినల్ మేనేజర్ హర్జోత్ సింగ్ సంధు కీలక విషయాలు వెల్లడించారు. “IRCTC అనేది పాన్ ఇండియా నెట్ వర్క్ తో కూడిన ప్రభుత్వ రంగ సంస్థ. ప్రతిరోజూ దాదాపు 5-6 కోట్ల వెబ్ సైట్ హిట్ అవుతాయి. ఈ అవగాహన ఒప్పందం ద్వారా, పర్యాటకులు HPTDC హోటళ్లలో బస చేయడానికి, టాయ్ ట్రైన్ లాంటి వారసత్వ మార్గాల ద్వారా సిమ్లా అందాలను చూసి ఎంజాయ్ చేసేందుకు రైల్వే ఆధారిత టూరిజం ప్యాకేజీలను జాయింట్ గా ప్రోత్సహిస్తాం” అన్నారు. హిమాచల్ ప్రదేశ్ను అనుసంధానించే IRCTC చివరి ప్రధాన రైల్వే స్థావరంగా కల్కా పని చేస్తుందన్నారు. అక్కడి నుంచి పర్యాటకులను కాంపోజిట్ ట్రావెల్ ప్యాకేజీల ద్వారా సిమ్లా, బరోగ్, కియారిఘాట్తో సహా గమ్యస్థానాలకు మళ్లిస్తారని ఆయన వివరించారు.
హోటల్ ఆక్యుపెన్సీ, ఆదాయాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు HPTDC మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. “రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న HPTDC 1,111 గదులు ఖాళీగా ఉండకుండా చూసుకోవడమే మా టార్గెట్. పెరిగిన ఆక్యుపెన్సీ హోటళ్లను సకాలంలో పునరుద్ధరించడానికి, జీతాలను వెంటనే చెల్లించడానికి, కార్పొరేషన్ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మాకు ఈ ఒప్పందం సహాయపడుతుంది” అని ఆయన అన్నారు.
Read Also: జస్ట్ 2 గంటల్లో బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!
ఇక అవగాహన ఒప్పందంలో భాగంగా, IRCTC, HPTDC ‘సిమ్లా టాయ్ ట్రైన్ వీకెండ్ గెట్అవే’ ప్యాకేజీని ప్రారంభించాయి. ఇది మార్చి 27 నుంచిమార్చి 29, 2026 వరకు రెండు రాత్రులు, మూడు రోజుల పర్యటన. ఈ ప్యాకేజీ కల్కాలో ప్రారంభమవుతుంది. చార్టర్డ్ టాయ్ ట్రైన్ కోచ్ లో సిమ్లాకు ప్రయాణం, హోటల్ హాలిడే హోమ్ లో వసతి, సిమ్లా, కుఫ్రీలో సందర్శనా స్థలాలు ఉంటాయి. ఈ ఈ ప్యాకేజీలో మూడు బ్రేక్ ఫాస్ట్ లు ఉంటాయి. ఒక్కో వ్యక్తికి రూ. 8,255 నుంచి టికెట్ ధర ఉంటుంది.