ప్రముఖ నటి సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణ వార్త విని టీవీతో పాటు సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. అభిమానులు కంటతడి పెడుతున్నారు. ‘కుంకుమ భాగ్య’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంచిత కేవలం 30 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందరినీ షాక్కు గురి చేసింది. ముంబై సమీపంలోని నలసోపారలో ఉన్న తన నివాసంలో ఆమె చనిపోయి కనిపించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ ఘటన జరిగిన సమయంలో సంచిత ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పరిచయస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సంచిత ఉగలే టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘కుంకుమ భాగ్య’, ‘వాగ్లే కి దునియా’ లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. సహజమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం టెలివిజన్ కే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నారు.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ చిత్రంలో ఆమె పోషించిన తారాబాయి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అలాగే ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రాజెక్ట్ లో కూడా ఆమె నటించారు. బుల్లితెర, వెండితెర రెండింట్లోనూ తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె అకాల మరణం అందరినీ కలచివేసింది.
సోషల్ మీడియాలో కూడా సంచిత చాలా యాక్టివ్గా ఉండేవారు. తరచూ ఫోటోలు, వీడియోలు, రీల్స్ పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉండేవారు. మరణానికి కొద్ది గంటల ముందు కూడా ఆమె సోషల్ మీడియాలో సాధారణంగా కనిపించారు.
సంచిత గతంలో యువ ఇన్ ఫ్లూయెన్సర్ మిషా అగర్వాల్ మరణించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. యువత మానసిక ఒత్తిడికి లోనవకుండా జాగ్రత్తపడాలని, జీవితాన్ని తేలికగా తీసుకోకూడదని ఆమె సూచించారు. సోషల్ మీడియా గుర్తింపు కోసం ఎక్కువగా ఆందోళన చెందవద్దని కూడా ఆమె అప్పట్లో చెప్పుకొచ్చారు. అలాంటి సంచిత, ఇప్పుడు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. సంచిత మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఆమె అకాల మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: సినిమా అవకాశం పేరుతో మోసం.. బంజారాహిల్స్ పీఎస్ లో యువ నటి ఫిర్యాదు!