తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఓ యువ నటిని మోసం చేయడంతో పాటు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
21 ఏళ్ల యువనటి కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రసాద్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించి, ఒక సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన యువనటి ఆ సినిమాలో నటించింది. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. షూటింగ్ ముగిసిన తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదు. మొత్తం రూ.90 వేల రెమ్యునరేషన్తో పాటు రూ.38 వేల ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ప్రసాద్ తప్పించుకుంటూ వచ్చాడని బాధితురాలు ఆరోపించింది. పలుమార్లు డబ్బుల గురించి అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 18న బాకీ డబ్బుల విషయమై మాట్లాడేందుకు తనను కలవాలని ప్రసాద్ చెప్పినట్లు నటి తన ఫిర్యాదులో తెలిపింది. అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వివరించింది. తనను కారులోకి ఎక్కించుకుని, భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. అంతేకాకుండా తన కోరికలకు అంగీకరిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడని, లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలు పేర్కొంది. అయితే అతని నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన ఆమె, జరిగిన విషయాన్ని ఇంటికి వెళ్లి తన తల్లికి వివరించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి నిందితుడిని సంప్రదించి నిలదీసినట్లు సమాచారం. కానీ, తన తప్పును ఒప్పుకోవడం బదులుగా ఆమెపైనా అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె చివరకు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై మోసం, వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి సినీ పరిశ్రమలో మహిళల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై చర్చకు దారితీసింది. సినిమా అవకాశాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: అమ్మాయితో ప్రేమాయణం.. ఆంటీతో సహజీవనం, ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ఏం చేశాడంటే