Bigg Boss: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) ఇండియాలో దాదాపు ప్రతి భాషలో ప్రసారమవుతూ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతోంది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎంతోమంది ఈ షోపై విమర్శలు గుప్పిస్తూ ఆపివేయాలి అంటూ డిమాండ్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు మరో బిగ్ బాస్ షో వివాదంలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi/ చేసిన కామెంట్ల వల్లే ఈ షో వివాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి విజయ్ వ్యాఖ్యానించారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటూ మొత్తం ఐదు భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు సెప్టెంబర్ 6వ తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ్ భాషల్లో పదవ సీజన్ ప్రారంభం అయింది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. తమిళ్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ” ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇవ్వడం .. సమస్యల నుంచి పారిపోయేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం.. నాయకుడి లక్షణం కాదు” అంటూ బిగ్ బాస్ వేదికపై విజయ్ సేతుపతి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసాయి.
ఇకపోతే విజయ్ చేసిన వ్యాఖ్యలు, టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ ను ఉద్దేశించి చేశారని ఆ పార్టీ శ్రేణులు అలాగే విజయ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ సేతుపతి పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో విజయ్ టీవీ యాజమాన్యం స్పందిస్తూ.. అధికారిక ప్రకటన విడుదల చేసింది. “బిగ్ బాస్ అనేది కేవలం పూర్తిగా వినోదాత్మక కార్యక్రమం మాత్రమే. ఇందులో ప్రసారమయ్యే అభిప్రాయాలు, సంభాషణలు కేవలం షోకి మాత్రమే పరిమితం . షోలోని గేమ్, కెప్టెన్సీ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే. వాటిని షో వెలుపల ఉన్న ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ విధానాలతో ముడి పెట్టడం సరికాదు”.. అంటూ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా కార్యక్రమంలో వచ్చే సంభాషణలను ఎవరూ వ్యక్తిగత విమర్శలుగా భావించకూడదని కూడా ఛానల్ తేల్చిచెప్పేసింది. ఇక మొత్తానికి అయితే ఈ వివాదం అటు కోలీవుడ్ ఇటు పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ సేతుపతి విషయానికొస్తే.. ఒకవైపు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా మారారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఎస్ శశి కుమార్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ట్రైన్ లో కూడా నటించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే డైరెక్టర్ బాలాజీ తో కలిసి బత్తా అనే ప్రాజెక్టులో భాగమయ్యారు. ఫస్ట్ లుక్ అవతార్లో విజయ్ సేతుపతి ఆకట్టుకున్నారు. ఇక ఇంజి వెల్లం అనే చిత్రంతోపాటు అరసన్ అనే చిత్రంలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నారు.