Rajasthan Murder Case:మనుషులకు మానవత్వం అనేది లేకుండా పోతుంది. మనస్పర్థాలు, గొడవలు ఉంటే చాలు.. రాక్షసులుగా మారిపోయి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఇద్దరు సోదరులతో పాటు వారితో ఉన్న ఐదుగురిపై లారీతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శనివారం అర్థరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అది కాస్త పెరిగి వివాదానికి దారి తీసింది. అయితే గొడవ అనంతరం ఈ విషయంపై ఓ వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు భరత్ సింగ్, ధీరజ్ సింగ్, తుషాన్ సింగ్, గోవర్థన్ సింగ్, బాలు సింగ్ కలిసి అర్థరాత్రి వేళ పగారియా పోలీస్ స్టేషన్ కు కలిసి బయలుదేరారు.
ఈ ఐదుగురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలుసుకున్న మరో వర్గం వారు ఎలా అయినా వారిని ఆపాలని యత్నించారు. ఈ నేపథ్యంలో వారిని లారీలతో వెంబడించారు. ఐదుగురు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించినా బతకలేకపోయారు. లారీతో వచ్చి ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులపై నుంచి దూసుకెళ్లారు. దీంతో ఆ ఐదుగురు బాధితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం లారీని వదిలి నిందులు అక్కడి నుంచి పారిపోయారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి బాధితులు ఎవరనేది గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటన అనంతరం గ్రామంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని నలువైపులా భారీగా మోహరించారు.
మరోవైపు తమ బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో బాధితుల సన్నిహితులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలో ఎప్పుడు ఎటువంటి అలజడి సృష్టిస్తారో అనే భయాందోళనతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.