Hyderabad Metro: అమీర్పేట్ మెట్రోలో 62 ఏళ్ల సీనియర్ సిటిజన్పై దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనలో సైఫాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గత నెల 21న హైదరాబాద్ మెట్రో రైలులో చోటుచేసుకుంది. ఇక్కడ సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటు ఇవ్వమని అడిగినందుకు వృద్ధుడిని యువకులు అవమానించి దాడి చేశారు.
అమీర్పేట్ నుండి మెట్రోలో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వృద్ధుడితో ముగ్గురు యువకులు దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటును ఇవ్వమని వారిని కోరగా, ఆ యువకులు అతనిపై దాడి చేసి అవమానించారు. ఈ వాగ్వాదం లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వరకు కొనసాగింది. అక్కడ ఆ ముగ్గురు యువకులు మరింతగా రెచ్చిపోయి వృద్ధుడిని రైల్వే ట్రాక్పైకి నెట్టివేశారు. ఈ దాడిలో వృద్ధుడికి గాయాలయ్యాయి.
దాడికి గురైన బాధితుడు వెంటనే ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్పై దురుసు ప్రవర్తన దాడికి సంబంధించిన ఫిర్యాదును అందుకున్న సైఫాబాద్ పోలీసులు తక్షణమే స్పందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మెట్రో రైలులో జరిగిన ఈ దుశ్చర్యపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తద్వారా సామాన్య పౌరులకు.. ముఖ్యంగా వృద్ధులకు మెట్రో ప్రయాణం సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగాజజ సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల సహాయంతో నిందితులను త్వరగా గుర్తించారు. నిందితులుగా గుర్తించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా.. నిందితులు తమ నేరారోపణలను అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు సివ్వల సునీల్ కుమార్ (32), సివ్వల రాజేష్ (34), కాలిశెట్టి అశోక్ (34) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులపై 109(1), 126(2), 352 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ: Allu Arjun-Sneha Reddy: స్టైలిష్ కపుల్ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అరెస్టు తరువాత.. సైఫాబాద్ పోలీసులు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని రిమాండ్కు పంపింది. సీనియర్ సిటిజన్పై జరిగిన ఈ దాడి ఘటన మెట్రో ప్రయాణీకులలో చర్చనీయాంశమైంది. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఈ కేసును ఒక ఉదాహరణగా పరిగణిస్తున్నారు