Bhadrachalam: భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రస్తుతం రామనామస్మరణతో మారుమోగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తుల కళ్లకు విందు చేసింది.
హంస వాహనంపై జలవిహారం సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కలిసి శ్రీరామచంద్రమూర్తి సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుదీరారు. గోదావరి నది తీరంలో విద్యుత్ వెలుగుల మధ్య, బాణాసంచా పేలుళ్ల హోరులో స్వామివారు నదిపై విహరించారు. గోదావరి అలలపై హంస వాహనం సాగుతుంటే.. భక్తులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.