Silkworm Rearing: మంచిర్యాల అడవుల్లో పట్టు పురుగులు పెంచొద్దట. ఎస్.. ఇప్పుడు దీని మీదే అడవిలో రగడ నడుస్తోంది. కోటపల్లి అటవీప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, పట్టు పరిశ్రమ అధికారుల మధ్య కొత్త వివాదం మొదలైంది. ఇక్కడి గిరిజన రైతులకు అడవిలోని మద్ది చెట్లపై పట్టు పురుగుల పెంపకమే జీవనాధారం. అయితే అడవిలో ఇందుకు అనుమతి లేదంటూ మద్ది చెట్లపై ఉన్న పట్టు పరుగులను అటవీ సిబ్బంది దులిపేశారని రైతులు చెబుతున్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే రైతులకు పట్టు పురుగుల సీడ్స్ సప్లై చేశామని, అటవీ సిబ్బంది అత్యుత్సాహంతో వాటిని ధ్వంసం చేశారని పట్టు పరిశ్రమ అధికారులు ఫైర్ అవుతున్నారు. అటవీ అధికారుల తీరుతో.. తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న పట్టు పురుగుల పెంపకానికి అటవీ అధికారుల అభ్యంతరం దేనికి?