Gachibowli: రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్నాడు.. నాది రియల్ లవ్ అన్నాడు.. ప్రేమించిన నెల రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. తీరా కాపురం చేస్తుంటే.. కాదు పొమ్మని ఎస్కేప్ అయ్యాడు. హైదరాబాద్ హయత్నగర్లో వెలుగు చూసిన ప్రియుడి మోసం ఘటన ఇది. తనకు న్యాయం చేయాలంటూ మోసపోయిన యువతి హయత్నగర్లోని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతోంది.
తనను ప్రియుడు మోసం చేశాడని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక. గత సంవత్సరం నిఖిల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని.. రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి తనకు పరిచయం అయిన నెల రోజుల్లో పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది మౌనిక. విజయవాడకు వెళ్లి ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. గత వారం తనపై ఇంట్రెస్ట్ లేదని.. ఇంట్లో నుండి వెళ్లిపోయాడని.. దీంతో తనను నిఖిల్ మోసం చేశాడని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. అత్తింటివారు మాత్రం మేము క్రిస్టియన్స్.. మాకు, నీకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని తెలిపింది మౌనిక. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఇప్పటికైనా పోలీసులు జోక్యం చేసుకొని నిఖిల్ను రప్పించాలని కోరుతోంది.