Nadendla Manohar: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అడుగులు వెనక్కి వేశాం కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే ఫార్ములా వర్తిస్తుందనుకుంటే పొరపాటని జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
2024 శాసనసభ ఎన్నికల సమయంలో ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ ఒక అడుగు వెనక్కి తగ్గి, తక్కువ స్థానాల్లో పోటీ చేసి కూటమిని బలపరిచారని ఆయన గుర్తుచేశారు. అయితే, నాటి రాజకీయ పరిస్థితులకు, నేటి స్థానిక ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి చోటా కచ్చితంగా పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం, కూటమి అధికారం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని జనసేన అధినాయకత్వం గుండెల్లో పెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈసారి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు న్యాయమైన అవకాశం కల్పిస్తామని, స్థానిక పోరులో పార్టీ సత్తా చాటుతామని మనోహర్ ధీమా వ్యక్తం చేశారు.