Hyderabad Accidents: ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి చనిపోయింది. ఎంపీ లింగమనేని కొడుకు సంజూష్పై నెగ్లిజెన్స్, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కాకపోవడంతో అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. ఐదేళ్లలోపు శిక్ష ఉండటంతో అరెస్ట్ అవసరం లేదన్నది పోలీసులు అంటున్న మాట. అయితే ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన పలుకుబడితో ముగిసిపోతుందా? బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందా అన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్.
ఇదే సమయంలో ఆగస్టు 31 తెల్లవారుజామున రాయదుర్గంలో మరో ఘోర ప్రమాదం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కారుతో ఢీకొట్టాడు. ఒకరు చనిపోగా, సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఆనంద్ సాయి కొడుకు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలు జల్లెడపట్టారు. పట్టుకున్నారు. ఇది హిట్ అండ్ రన్ కేసు. పట్టుకున్నాక డ్రగ్స్ టెస్టులు చేశారా? ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు? ఇవన్నీ ప్రశ్నలుగా ఉండగానే బెయిల్ వచ్చేసింది. బయటికొచ్చేశాడు సందీప్. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇస్తే బాధ్యత తీరిపోతుందా..? భారతి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించినా, అది అమలైందా..? పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమా?