103 Year Old Woman Rebirth:మృత్యువు వాకిలి వరకు వెళ్ళి ప్రాణాలను వెనక్కి తెచ్చుకోవడం అంటే సినిమా కథల్లోనే చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఒక బామ్మా విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. చావు ఇంట్లో నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఏడుపులు వినిపిస్తున్న వేళ.. పాడె ఎక్కించాల్సిన సమయంలో ఆమె కాలి వేళ్లు కదిలాయి. ప్రాణం పోయిందని భావించి అంత్యక్రియలకు సిద్ధమైన కుటుంబ సభ్యులు, ఆమె కళ్లు తెరవడంతో షాక్ తిన్నారు. చిత్రమేమిటంటే, అదే రోజు ఆమె పుట్టినరోజు కూడా కావడంతో, స్మశానానికి వెళ్లాల్సిన బామ్మాకు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా రామ్టెక్ పరిధిలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 103 ఏళ్ల గంగాబాయి సఖారే సోమవారం సాయంత్రం కదలికలు లేకపోవడంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఉదయానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం ఆమెకు కొత్త చీర కట్టి, ముక్కులో దూది పెట్టి, చేతులు కాళ్లు కట్టేశారు. బంధువులందరూ కడసారి చూపు కోసం తరలివచ్చారు.
అయితే, అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె మనవడు రాకేష్ సఖారేకు ఒక ఆశ మెరిసింది. ఆమె కాలి వేళ్లు స్వల్పంగా కదలడాన్ని అతను గమనించాడు. వెంటనే ముక్కులోని దూది తీసి చూడగా, గంగాబాయి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. చనిపోయిందనుకున్న బామ్మా ప్రాణాలతో ఉందని తెలియగానే ఆ ఇల్లంతా ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది.
ముందస్తుగా వేసిన అంత్యక్రియల టెంట్లను తొలగించి, శవవాహనాన్ని వెనక్కి పంపేశారు. అదే రోజు ఆమె 103వ పుట్టినరోజు అని గుర్తుకు రావడంతో, అందరూ కలిసి కేక్ తెప్పించి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అంత్యక్రియల కోసం విషాద వదనాలతో వచ్చిన బంధువులు, బర్త్ డే కేక్ తిని సంతోషంగా వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ ‘లివింగ్ మిరాకిల్’ బామ్మాను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు.
Read Also: ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?