తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుల ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజంపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం అనైతికమని ఆయన విమర్శించారు.
ఒక న్యూస్ రిపోర్ట్కు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే, హడావిడిగా జర్నలిస్టులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. చట్టపరమైన నిబంధనలను తుంగలో తొక్కి, కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వమే స్వయంగా సిట్ను ఏర్పాటు చేసినప్పుడు, ఆ విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థపై ముఖ్యమంత్రికి నమ్మకం లేకనే ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతున్నారా..? లేక ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనా..? అని నిలదీశారు. తలుపులు బద్దలు కొట్టి, భయాందోళనను సృష్టించి జర్నలిస్టులను అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిట్ ద్వారా పూర్తిస్థాయిలో.. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మీడియా గొంతు నొక్కేలా, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
చివరగా, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి, చట్టం తన పని తాను చేయాలని.. కానీ అది కక్ష సాధింపునకు వేదిక కాకూడదని హితవు పలికారు.
ALSO READ: Harish Rao: మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ యత్నం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు