Eternal Wedding: మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం కదిలించే ప్రేమకథకు, అంతకంటే మిన్నగా ఒక తండ్రి పశ్చాత్తాపానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన రామ్ కోటి, అదే గ్రామానికి చెందిన ఒక యువతి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే.. సుమారు 22 ఏళ్ల క్రితం నాటి సామాజిక పరిస్థితులు, కుల మతాల పట్టింపుల వల్ల వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. తమ ప్రేమను గెలిపించుకోలేక, విడిపోయి జీవించలేక ఆ జంట మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
తమ చేతులతో పెంచి పెద్ద చేసిన కొడుకు చిన్న వయసులోనే విగతజీవిగా మారడాన్ని తండ్రి భిక్షం నాయక్ తట్టుకోలేకపోయారు. తన కొడుకు ప్రేమను కాదన్నందుకే ఈ దారుణం జరిగిందని ఆయన తీవ్రంగా మధనపడ్డారు. కాలం గడిచినా కొడుకు జ్ఞాపకాలు ఆయనను నీడలా వెంటాడాయి. ఆ పశ్చాత్తాపంతోనే తన ఇంటి ఆవరణలోనే కుమారుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడిలో రామ్ కోటితో పాటు అతని ప్రేయసి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి, వారిని దేవతామూర్తులుగా ఆరాధించడం ప్రారంభించారు.
గత 22 ఏళ్లుగా ఈ తండ్రి తన కొడుకు ప్రేమను గౌరవిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినం నాడు సీతారాముల కళ్యాణం తరహాలోనే.. ఈ విగ్రహాలకు అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తున్నారు. గ్రామస్తులు, బంధువుల సమక్షంలో మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఈ వేడుక జరుగుతుంది. ఒకప్పుడు వద్దన్న ప్రేమకే ఇప్పుడు పెద్దలందరూ సాక్ష్యంగా నిలిచి పెళ్లి చేయడం విశేషం.
ఈ ఉదంతం పశ్చాత్తాపం మనిషిని ఏ విధంగా మార్చుతుందో చెప్పడానికి ఒక నిదర్శనం. చనిపోయిన తర్వాతనైనా వారిని ఒకటి చేసి, ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్న ఆ తల్లిదండ్రుల ప్రేమ తండా వాసులందరినీ కదిలిస్తోంది. ఈ వినూత్న కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు.
Also Read: సినిమాను తలపించే సీన్.. మనుషులు చేయలేని పనిని ఈ కుక్కలు చేసి చూపించాయి!