ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారుల కోసం ఉద్దేశించిన ‘తొలి ముద్ద’ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో పాటు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి రెడీ టూ కుక్ ఫుడ్ పదార్థాలను అల్పాహారంగా అందజేస్తారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు విధి నిర్వహణలో తోడ్పడేందుకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ పథకం ప్రారంభోత్సవానికి ఒక చారిత్రక నేపథ్యం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో దేశంలో ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ) పుష్కలంగా ఉన్నప్పటికీ.. పౌష్టికాహారం (న్యూట్రిషన్ ఫుడ్) అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోందని తెలిపారు. దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎన్ని మంచి ప్రణాళికలు రూపొందించినా వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వం వారిపై గురుతర బాధ్యత పెట్టిందని చెప్పారు. అంగన్వాడీ చిన్నారులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారికి సకాలంలో పౌష్టికాహారం అందించాలని కోరారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కేవలం ఉద్యోగులుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని భరోసా ఇచ్చారు. వారి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఆర్థిక వెసులుబాటు కలిగిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అంగన్వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల కోసం సొంత భవనాలను నిర్మించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని వివరించారు. సరైన ఆహారం లేకపోవడం వల్ల పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని.. భవిష్యత్తులో ఇవి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తాయని హెచ్చరించారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకే ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: cm revanth : రేవంత్ నోట శివతాండవం.. లిస్టులో ఫస్ట్ ఉన్నదెవరు?