Bride birth 24 hours after wedding: పెళ్లి అనేది జీవితాంతం కలిసి ఉండాలని ఆశించే ఒక పవిత్ర బంధం. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత కొత్త దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. కొన్నాళ్ల తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, పెళ్లయిన మరుసటి రోజే పెళ్లికూతురు పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తే? ఊహించడానికే వింతగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
గ్రేటర్ నోయిడాలోని దంకౌర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి, బులంద్షహర్కు చెందిన యువతితో సోమవారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి ముగిసిన తర్వాత వధువు తన అత్తవారింటికి చేరింది. అయితే, మంగళవారం సాయంత్రం ఆమెకు హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వధువును పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతి అని చెప్పడంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే రాత్రి ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలియగానే వరుడి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు నెలల క్రితం నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ విషయం తమకు తెలియదని, తమను మోసం చేసి ఈ పెళ్లి చేశారని వధువు తరపు వారిపై ఆరోపణలు చేశారు. వధువు కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ, గర్భవతి అన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసినందుకు నిరసనగా వరుడి కుటుంబం ఆ యువతిని, శిశువును తమ ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించింది. చివరకు వధువు తల్లిదండ్రులు ఆమెను, పుట్టిన బిడ్డను తీసుకుని తమ స్వగ్రామమైన బులంద్షహర్కు వెళ్లిపోయారు.
కేవలం 24 గంటల వ్యవధిలో పెళ్లిపీటల నుంచి ఆసుపత్రి బెడ్ వరకు వెళ్లిన ఈ ఉదంతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వింత ఘటన వైరల్గా మారింది. ఈ ఘటన వల్ల రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తడమే కాకుండా, పెళ్లి సమయంలో ఇరు పక్షాల మధ్య ఉండాల్సిన పారదర్శకత.. నమ్మకంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ వధువు తన పుట్టింట్లోనే ఉంటోంది.
Read Also: విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!