Khammam News: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో మానవత్వం పరిమళించింది. మూగజీవాల పట్ల అక్కడి గ్రామస్థులు చూపిన ప్రేమ, భక్తి అందరినీ కదిలించింది. విద్యుత్ షాక్తో మరణించిన ఒక వానరానికి (కోతికి), మనిషికి నిర్వహించిన తరహాలోనే సకల మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు.
గ్రామంలోని విద్యుత్ తీగలు తగిలి ఒక కోతి మరణించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మూగజీవాలు చనిపోతే వాటిని పట్టించుకోకుండా వదిలేసే కాలంలో.. జీళ్లచెరువు గ్రామస్థులు మాత్రం భిన్నంగా స్పందించారు. వానరాన్ని సాక్షాత్తు ఆ హనుమంతుడి స్వరూపంగా భావించే గ్రామస్థులు.. దాని మృతికి సంతాపం తెలుపుతూ ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు.
పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులంతా ఏకమై కోతి పార్థివ దేహాన్ని గౌరవపూర్వకంగా సిద్ధం చేశారు. మరణించిన వానరానికి హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. గ్రామం మొత్తం మంగళవాయిద్యాల నడుమ, పూలమాలలతో అలంకరించిన వాహనంపై వానరాన్ని ఊరేగించారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలు పాడుతూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఊరేగింపు అనంతరం.. గ్రామ శివారులో హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘కోతిని మేము కేవలం ఒక జంతువుగా చూడలేదని.. హనుమంతుడి ప్రతిరూపంగా భావించి ఈ గౌరవాన్ని అందించామని’ తెలిపారు.
యంత్రంలా మారిపోతున్న సమాజంలో.. ఒక మూగజీవి పట్ల చూపిన ఈ నివాళి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. జీళ్లచెరువు గ్రామస్థులు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రశంసలందుకుంటోంది.
ALSO READ: Jagtial District: టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడి.. తిరగబడిన స్టూడెంట్స్, చివరకు ఏమైందంటే..?
వానరానికి వీడ్కోలు.. మనిషిలాగే అంత్యక్రియలు
మనిషికి నిర్వహించినట్టే ఒక కోతికి అంత్య క్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు కూసుమంచి (M) జీళ్లచెరువు గ్రామస్థులు. ఊరిలో ఈరోజు ఒక వానరం మృతి చెందగా.. గ్రామస్థులంతా ఏకమై మంగళవాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం… pic.twitter.com/fBpsUb84aQ
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2025