గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండేవారు సర్పంచ్. ఊళ్లో జనానికి ఏ సమస్య వచ్చినా, వాళ్లు సర్పంచ్ దగ్గిరికి వెళ్లి తన బాధను చెప్పుకుంటారు. కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని వేడుకుంటారు. సర్పంచ్ పెద్ద మనిషి స్థాయిలో తనకు తోచిన సాయం చేస్తుంటారు. అయితే, ఇక్కడ ఏకంగా ఆ ఊరికి సర్పంచే సమస్యగా మారింది. ఆమె చేసిన పనికి దేశ వ్యాప్తంగా తమ ఊరు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? చేసిన ఘనకార్యం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నైలోని నేర్కుండ్రం రెడ్డి వీధికి చెందిన ఎల్ వరలక్ష్మి (50) జూలై 14న కాంచీపురం నుంచి ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తుంది. కోయంబేడులో దిగిన తర్వాత ఆమె తన సంచిని చెక్ చేసుకంటుంది. ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యింది. తన దగ్గర ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు మాయం అయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు పోలీసులు బస్సులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ విజువల్స్ లో ఓ మహిళ వరలక్ష్మి బ్యాగు నుంచి బంగారు గొలుసు దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఆమె మహిళను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృదంగా ఏర్పడి ఆరా తీయడం మొదలు పెట్టారు.
పోలీసులు గొలుసు దొంగతనం చేసిన మహిళను పట్టుకునేందుకు చేసిన దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది. ఆ దొంగ మరెవరో కాదు తిరుపత్తూరు జిల్లాలోని నరియంబట్టు పంచాయతీ సర్పంచ్ భారతి(56) అని తేలింది. అంతేకాదు, ఆమె డీఎంకే యాక్టివ్ నాయకురాలిగా కొనసాగుతోంది. పోలీసులు భారతిని తిరుపత్తూరులో గుర్తించి, అరెస్టు చేశారు. విచారణ కోసం చెన్నైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఆమె మీద తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరులలో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసు దర్యాప్తులో తేలింది. అవన్నీ దొంగతనం కేసులేనని పోలీసులు గుర్తించారు.
విచారణలో మహిళా సర్పంచ్ భారతి చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. తనకు దొంగతనం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వస్తువులను కొట్టేయడంలో తనకు ఓ ఆనందం కలుగుతుందని వివరించింది. దొంగతనం చేసిన సొమ్ముతో ఏకంగా తన గ్రామంలో షాపింగ్ మాల్ కట్టినట్లు వెల్లడించింది. “నాకు డబ్బు, కీర్తి, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ, దొంగతనం చేసినప్పుడు నాకు ఆనందం లభిస్తుంది. అందుకే నేను 15 సంవత్సరాలుగా దొంగతనం చేస్తున్నాను. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి దొంగతనం చేశాను. దొంగిలించబడిన నగలతో నా స్వగ్రామంలో షాపింగ్ మాల్ నిర్మించాను. ఇకపై దొంగతనం చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ఆమె వివరించారు. పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
భారతి డీఎంకే సర్పంచ్ కావడంతో విపక్ష ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్తులకు డీఎంకే ఆశ్రయం కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..