జూలై 5న జపాన్ అతలాకుతలం కాబోతోందా? భారీ సునామీ ముంచేయబోతోందా? అక్కడి ప్రజల మదినిండా ఇవే ఆలోచనలు చెలరేగుతున్నాయి. జూలై 5, 2025 గురించి ఆధ్యాత్మికవేత్త న్యూ బాబా వంగా చెప్పిన జోస్యం ఇప్పుడు జనాల్లో భయాన్ని నింపుతోంది. అంతేకాదు, అక్కడికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు కూడా తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
ఇంతకీ ఎవరీ న్యూ బాబా వంగా?
జపాన్ కు చెందిన మాంగా కళాకారిణి రియో టాట్సుకిని న్యూ బాబా వంగా అని పిలుస్తారు. ఆమె చెప్పిన జోస్యం చాలా వరకు నిజం అవుతుందని అందరూ భావిస్తున్నారు. జూలైలో జపాన్ కు అతిపెద్ద సునామీ ముప్పు తప్పదని ఆమె గతంలో జోస్యం చెప్పారు. ఈ ఏడాది జూలై 5న ఈ భారీ విపత్తు రాబోతోందని ‘ది ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో న్యూ బాబా వంగా వెల్లడించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలడం వల్ల ఈ విపత్తు వస్తుందని ఆమె అంచనా వేశారు. ఈ విస్పోటనం పెను సునామీకి కారణం అవుతుందన్నారు. సముద్రం ఉప్పొంగి జపాన్ ను చుట్టేస్తుందని తెలిపారు.
విమాన టికెట్ల బుకింగ్ క్యాన్సిల్
న్యూ బాబా వంగా చెప్పిన రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు అప్రమత్తం అవుతున్నారు. ఎందుకైనా మంచిది ఇప్పుడు అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావిస్తున్నారు. అంతేకాదు, చాలా మంది తమ విమాన టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బుకింగ్స్ తగ్గడంతో పాటు ఉన్న టికెట్లను కూడా రద్దు చేసుకోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలు అవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య 50 శాతానికి తగ్గిపోయినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. థాయ్ లాండ్, వియత్నాం నుంచి కూడా భారీగా బుకింగ్స్ తగ్గిపోయినట్లు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. వచ్చే నెలలో 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని భావిస్తే, కేవలం 40 శాతం మాత్రమే బుక్ అయ్యాయని ఎయిర్ లైన్ జపాన్ కార్యాలయం తెలిపింది.
గతంలో నిజమైన న్యూ బాబా వంగా జోస్యం
వాస్తవానికి న్యూ బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు నిజం అయ్యాయి. 2011లో జపాన్ భూకంపం, సునామీ, ఫుకుషిమా అణు విస్పోటనం, ప్రిన్సెన్ డయానా మృతితో పాటు కరోనా గురించి కూడా ఆమె చాలా విషయాలు చెప్పారు. అవన్నీ నిజం అయ్యాయి కూడా. ఆమె చెప్పిన విషయాలు కచ్చితంగా నిజమే అనడానికి.. గతంలో ఆమె చెప్పిన విషయాలను ఆధారాలుగా తీసుకుంటున్నారు ప్రజలు.
జపాన్ అధికారులు ఏం చెప్తున్నారంటే?
అటు న్యూ బాబా వంగా జోస్యం మీద గవర్నర్ యోషిహిరో మురై కీలక విషయాలు వెల్లడించారు. ప్రజలు పుకార్లను నమ్మకూడదన్నారు. ఏదో జరుగుతుందని, ఎవరూ భయపడకూడదన్నారు. పర్యాటకులు కూడా ఆ పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ప్రశాతంతంగా ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలని సూచించారు. అటు భూ పరిశోధన నిపుణులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. విపత్తులను ముందుగానే పసిగట్టే టెక్నాలజీ జపాన్ దగ్గర ఉందంటున్నారు.
Read Also: ఇదేం చిత్రం.. మనిషి లేకుండా బైక్ దానంతట అదే పరుగు, వీడియో వైరల్!