సాధారణంగా ఇంట్లో వాళ్లు ఎవరైనా చనిపోతే.. వారికి సంప్రదాయాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మీరెప్పుడైనా కోడి పుంజుకు అంత్యక్రియలు నిర్వహించడం చూశారా..? అవును ఇక్కడో కుటుంబ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కోడిపుంజు చనిపోవడంతో.. మామూలుగా పారేయడానికి మనసు రాలేదు. దీంతో.. మనిషి చనిపోయినప్పుడు పాటించే సంప్రదాయాలను అనుసరించి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు జంతువులు, మనుషుల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పదో తెలియజేసింది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన వేల్పుల మొహంతు.. రెండేళ్ల క్రితం 10 కోడి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే వివిధ కారణాలతో తొమ్మిది కోడి పిల్లలు మృతి చెందగా.. ఒక పుంజు మాత్రమే పెద్దయ్యే వరకు బతికింది. ఆ పుంజును కుటుంబ సభ్యులు కేవలం పెంపుడు పక్షిలా కాకుండా, ఇంట్లో ఒక బిడ్డలా చూసుకున్నారు. దానికి చిన్నా అనే పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు.
ఇంటి ఆవరణలో ఎవరైనా అపరిచితులు అడుగుపెట్టగానే.. వారిని వెంబడించి పొడిచి భయభ్రాంతులకు గురి చేసేది ఆ కోడిపుంజు. కుక్కలా కాపలా కాస్తూ ఉండేది. దీంతో.. ఇంటి ముందు కోడి ఉంది – జాగ్రత్త అనే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. యజమాని మార్నింగ్ వాకింగ్కు వెళ్లేటప్పుడు సైకిల్పై తనతో పాటు ఆ కోడిపుంజును తీసుకెళ్లేవాడు. పిల్లలతో కలిసి ఆడుతూ, కుటుంబ సభ్యులతో కలిసిపోయిన ఆ కోడిపుంజు ఆ ఇంట్లో భాగమైపోయింది. అయితే అకస్మాత్తుగా వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ కోడిపుంజు మృతి చెందింది. తమ కళ్లముందే అల్లారుముద్దుగా పెరిగిన చిన్నా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయి కన్నీటి పర్యంతమయ్యారు.
మృతిచెందిన కోడిపుంజును మామూలుగా పారేయడానికి మనసు ఒప్పుకోని వారు.. మనిషి చనిపోయినప్పుడు చేసే సంప్రదాయాలన్నీ పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. పూలమాలలు వేసి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి, అనంతరం స్థానిక స్మశానవాటికలో సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మూగ జీవం పట్ల ఆ కుటుంబం చూపిన అపారమైన ప్రేమ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మనుషుల్లో తగ్గిపోతున్న మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు.
ALSO READ: Top 20 News: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, భాగ్యనగరంలో జింక మాంసం కలకలం