ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల వినియోగం పెరగడంతో పాటు వాటి ద్వారా జరిగే మోసాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో టిండర్ యాప్ వేదికగా జరిగిన ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడిని డేటింగ్ కు పిలిపించి.. పక్కా ప్లాన్తో అతడి నుంచి ఏకంగా రూ. 50,000 వసూలు చేసిన ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే?
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతనికి టిండర్ యాప్లో ఒక యువతి పరిచయమైంది. కొద్దిరోజుల సంభాషణ తర్వాత ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కర్కర్దూమా మెట్రో స్టేషన్ సమీపంలో చావ్లా బిల్డింగ్ రెండో అంతస్తులో ఉన్న ఒక కేఫ్ లో కలవాలని ఆ యువతి సూచించింది. పెట్రోల్ పంప్ పక్కనే ఉండటంతో ఆ ప్రదేశం కంఫర్ట్ గా ఉంటుందని ఆమె నమ్మబలికింది.
ఫోర్స్ ఆర్డర్స్.. షాకింగ్ బిల్లు!
మొదట్లో అంతా మామూలుగానే ఉన్నా, ఆర్డర్ ఇచ్చే సమయంలో కేఫ్ సిబ్బంది ప్రవర్తన వింతగా మారింది. వారు మెనూ కార్డును సరిగ్గా చూపించకుండా, అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలను, పానీయాలను ఆర్డర్ చేయమని ఒత్తిడి తెచ్చారు. ఆ యువతి కూడా ఖరీదైన ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ వెళ్ళింది. చివరకు బిల్లు చూసి ఆ యువకుడు షాక్కు గురయ్యాడు. కేవలం కొన్ని స్నాక్స్, డ్రింక్స్ కోసమే రూ. 50,000 బిల్లు వేశారు.
బాధితుడి హెచ్చరిక
తను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్ లో పోస్ట్ చేస్తూ ఇతరులను కీలక సూచనలు ఇచ్చాడు. ‘కర్కర్దూమా ప్రాంతంలోని కేఫ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇవి డేటింగ్ యాప్ల ద్వారా యువకులను ఆకర్షించి, భారీగా దోచుకుంటున్నాయి. ఎవరినైనా కలిసే ముందు ఆ ప్రదేశం రివ్యూలను తప్పక తెలుసుకోండి’ అని అతను సూచించాడు. తెలియని వ్యక్తులతో, ముఖ్యంగా మెట్రో స్టేషన్ల సమీపంలోని తెలియని కేఫ్లలో కలవడం ప్రమాదకరమని హెచ్చరించాడు.
కోల్కతాలోనూ ఇదే తరహా మోసం
ఈ పోస్ట్ వైరల్ కావడంతో మరికొందరు బాధితులు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కోల్కతాకు చెందిన ఒక వ్యక్తి స్పందిస్తూ.. తన బంధువు కుమారుడికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని తెలిపాడు. ఆర్డర్ చేయని పదార్థాలను కూడా బిల్లులో కలిపి వేల రూపాయలు వసూలు చేశారని, దీనిపై తాము వినియోగదారుల కోర్టులో కేసు వేశామని, తీర్పు కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నాడు.
ఈ తరహా కేఫ్ స్కామ్స్ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. యువకులు డేటింగ్ యాప్లలో ఎవరినైనా కలిసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రసిద్ధి చెందిన లేదా పబ్లిక్ ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.