Chamala Kiran Kumar Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ అండ్ టీమ్కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పునరావృతం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గడిచిన లోక్ సభ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని తమ అవయవాలను దానం చేసి మరీ ఆ పార్టీని గెలిపించిందని ఎంపీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు చిల్లర కూతలు కూస్తూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలు 70 శాతం మంది ప్రజలకు అందుతున్నాయని వివరించారు. ఈ విజయాలను కార్యకర్తలు గర్వంగా ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నేతల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి దక్షిణ కొరియా నియంత కిమ్ తరహాలో వ్యవహరించారని చామల ధ్వజమెత్తారు. పోలీసులను సొంత సెక్యూరిటీ ఫోర్స్లా వాడుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తుల పంపకాల పంచాయతీ నడుస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావుల అవినీతిని కవిత స్వయంగా బయటపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు ఓర్చుకోలేక విమర్శలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో బంధుప్రీతికి తావుండదని, కేవలం ప్రజల్లో ఆదరణ ఉండి గెలిచే వారికే ప్రాధాన్యత ఉంటుందని ఎంపీ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని పగటి కలలు కన్నా, మున్సిపల్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు