ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇది కలికాలం కాబట్టి.. ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు లేదా దాని గురించి వినే ఉంటారు. అయితే, అవన్నీ స్వలింగసంపర్కుల మధ్య జరిగే వివాహాలు. కానీ, ఒడిశాలో జరిగిన ఇద్దరు మగాళ్ల పెళ్లికి మాత్రం కారణాలు వేరేవి ఉన్నాయి. ఆ ఇద్దరు ఒక్కటైనది.. వారి గ్రామంలో వర్షాల కోసం.
అదేంటీ.. వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేయడం గురించి విన్నాం. కానీ, ఇలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఆ గ్రామంలో అలాగే చేస్తారు. అది వారి సాంప్రదాయం. వర్షం కోసం చేసిన పెళ్లే కదా.. అని లైట్గా తీసుకోవద్దు. గ్రామస్తులు ఏ మాత్రం తగ్గకుండా.. ఈ పెళ్లిని కూడా భారీ ఊరేగింపులు.. డేజే పాటలతో వేడుకగా నిర్వహించారు. నిజమైన పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి జాజ్పూర్ జిల్లాలోని గహ్మారియా గ్రామం వేదికైంది.
స్థానిక సిద్ధేవ్వరి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన మండపంలో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఒక అబ్బాయిని వరుడిగా, మరో యువకుడిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి.. ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. ముందుగా వధువు వేషంలో ఉన్న యువకుడు మండపానికి చేరుకుని వరుడు కోసం ఎదురు చూశాడు. గ్రామస్తులు వరుడిని కారులో కూర్చోబెట్టి.. డేజీ మ్యూజిక్కు చిందులు వేస్తూ ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం హిందూ సాంప్రదాయంలో వారికి పెళ్లి జరిపించారు.
గహ్మారియా గ్రామస్తులకు ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం ఇది. పురుషులకు పెళ్లి చేస్తూ వర్షాలు పడతాయని.. వారి పూర్వికులు చెప్పారట. గతంలో కూడా ఇలాంటి పెళ్లిల్లు చేశారు. దీని వల్ల గ్రామానికి పట్టిన దరిద్రం, దురదృష్టం తొలగిపోతాయని గ్రామస్తులు నమ్ముతారు. కొన్ని సార్లు అది నిజం కావడంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో సుమారు 25 ఏళ్ల కిందట కూడా ఈ విధంగానే వివాహం చేసినట్లు గ్రామస్తులు వెల్లడించారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు రైతులు విలవిల్లాడుతున్నారు. ఎల్నినో(EL NINO) ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని, వర్షపాతాన్ని, ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావం రుతుపవనాలపై కూడా పడింది. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. ఈ పరిస్థితి వల్ల గహ్మారియా గ్రామంలో వానలు లేవు. దీంతో పాత సంప్రదాయన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.
Also Read: వందే భారత్ ఎక్స్ ప్రెస్ అసలు పేరు ఏంటో తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఈ పెళ్లి జూన్ 17న జరిగింది. జతిన్ ఖతువా అనే యువకుడు వరుడుగా, కలాంది నాయక్ వధువుగా ముస్తాబై పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత వారిని ఊరంగా ఊరేగిస్తూ.. వర్షాలు కురవాలని ప్రార్థించారు. పెళ్లి తర్వాత గ్రామస్థులు ఆలయం సమీపంలో భారీగా అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.