Horror Restaurant Viral Video: వారణాసిలోని హారర్ థీమ్ రెస్టారెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా భోజనాన్ని వినోదాత్మక అనుభవంగా మార్చేందుకు ఈ రెస్టారెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అయితే, ఈసారి ఆ అనుభవం కొందరికి వినోదం కాకుండా భయానకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వారణాసిలోని కంకల్ హారర్ రెస్టారెంట్ కేఫ్ లోపలికి వెళ్తే చుట్టూ దెయ్యాలు, అస్థిపంజరాలు, మసకబారిన లైట్లు, కృత్రిమ పొగ లాంటి ఎలిమెంట్స్ తో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. టేబుళ్లపై కూడా బ్లడ్ ప్రింట్స్, ఎముకల ఆకారంలో ఉన్న కత్తులు, చెంచాలు లాంటి వస్తువులను ఉంచి మొత్తం సెటప్ ను మరింత రియలిస్టిక్ గా తయారు చేశారు. ఇది కస్టమర్లకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందించబడింది.
ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో ఈ కాన్సెప్ట్ పై విమర్శలకు కారణం అయ్యింది. ఆ వీడియోలో, దెయ్యం వేషంలో ఉన్న ఓ వెయిటర్ అకస్మాత్తుగా కస్టమర్ల దగ్గరికి వెళ్లి వారిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. పెద్దవాళ్లు కొంతవరకు సరదాగా తీసుకున్నా, అక్కడ ఉన్న ఓ చిన్న బాలుడు మాత్రం ఒక్కసారిగా వణికిపోయాడు. సిబ్బంది దగ్గరకు రాగానే అతడు ఏడ్వడం మొదలుపెట్టాడు. వద్దు ప్లీజ్.. అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలామంది ఈ రెస్టారెంట్ ను తీవ్రంగా విమర్శించారు. వినోదం కోసం వచ్చిన కస్టమర్లను, ముఖ్యంగా పిల్లలను ఇలా భయపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పెద్దలకు థీమ్ అనుభవం బాగానే అనిపించవచ్చని, చిన్నారులపై ఈ విధమైన ప్రయోగాలు మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు ఈ రెస్టారెంట్ థీమ్ నైతికంగా సరైనదేనా? అనే ప్రశ్నను లేవనెత్తారు. కస్టమర్ల అనుమతి లేకుండా అకస్మాత్తుగా భయపెట్టడం సరైన విధానం కాదంటున్నారు. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చే వారికి ముందుగా హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వినూత్నంగా ఉండాలనే ప్రయత్నంలో కొన్ని హద్దులు దాటకూడదనే విషయం ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. వినోదం, భయం మధ్య సరైన సమతుల్యత ఉండాలని నిపుణులు అంటున్నారు. లేదంటే, అది ఆనందాన్ని కాకుండా అసౌకర్యాన్ని కలిగించే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ఘటన తర్వాత, ఇలాంటి థీమ్ రెస్టారెంట్లు తమ విధానాలను మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: చర్లపల్లి స్టేషన్ లో ఘోరంగా దోమల బెడద, ప్రయాణికుల అవస్థలు చూస్తే అయ్యోపాపం అనాల్సిందే!