Kumbh mela Woman Dip Phone | ఆన్లైన్ ద్వారా వర్చువల్ పెళ్లిళ్లు, వీడియో కాల్ ద్వారా ప్రేమించుకోవడం, ఆటలు, పార్టీలు జరుపుకోవడం గురించి అందరూ చూసే ఉంటారు. కానీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వర్చువల్లో స్నానం కూడా చేయొచ్చని ఒక మహా పతివ్రత నిరూపించింది. కుంభమేళాలో పుణ్యస్నానం కోసం భర్తను ఇంట్లో వదిలి ఒంటరిగా వచ్చిందో మహిళ. అయితే అక్కడ ఆమె పుణ్యస్నానం చేశాక.. ఇంట్లో ఉన్న తన భర్తకు కుంభమేళాలోని త్రివేణి సంగమం నీటిలో పుణ్యస్నానం చేయించింది.
తన ఫోన్ను ఉపయోగించి భర్తకు వీడియో కాల్ చేసి, ఆ తర్వాత ఫోన్ను గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో ముంచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. “నీకో దండం తల్లి, ఇలా కూడా స్నానం చేయొచ్చని నీవు చూపించావు” అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ ముంచితే పుణ్యస్నాం అయిపోతుందా? అని ఒకరు కామెంట్ చేస్తే.. ఆ ఫోన్ ఇక పనిచేస్తుందా? అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకొక యూజర్ అయితే.. ‘ఇదేదో ఇదేదో స్టేడియంకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసినట్లుగా ఉందే’.. అని ఫన్నీగా రాశాడు.
ఫొటోలు ముంచి పుణ్యస్నానాలు
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ఇటీవల కుంభమేళాలో ఒక వ్యక్తి.. భక్తుల నుంచి 1100 రూపాయలు తీసుకుని.. వారి ఫోటోలను ప్రింట్ చేసి త్రివేణీ సంగమంలో ముంచి పుణ్యస్నానం చేయిస్తానని చెప్పాడు. ఇలా చేయడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని ఆయన వాదించాడు. ఈ పద్ధతిని అనుసరించి కొందరు తమ కుటుంబ సభ్యుల ఫోటోలను నీటిలో ముంచారు. ఎవరి భక్తి వారిది మరి.
అయితే, ఈ పద్ధతిని మించి ఒక మహిళ తన భర్తకు వర్చువల్ స్నానం చేయించింది. కుంభమేళాకు వెళ్లి, అక్కడి నుంచే తన భర్తకు వీడియో కాల్ చేసి.. ఫోన్ను నీటిలో ముంచి స్నానం పూర్తి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఫ్రీగా గేదెలు వస్తాయి.. రెండో పెళ్లి చేసుకుంటా!.. భర్త ఉండగానే
‘ ప్రయాగ్రాజ్ రావొద్దు ప్లీజ్.. అధ్వానంగా ఉంది’
మహా కుంభమేళా ముగింపు సమయంలో ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మహా శివరాత్రి పర్వదినానికి పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ వైపు వస్తున్నారు. ఈ పరిస్థితిలో నగరవాసులు సోషల్ మీడియాలో “దయచేసి ప్రయాగ్రాజ్కు రావద్దు” అని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, పారిశుధ్యం లేకపోవడం వంటి అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
మహా కుంభమేళా కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించింది. అయితే, భక్తులు చెత్త, మలమూత్ర విసర్జన చేయడం, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ప్రధాన రోడ్లతో పాటు వీధుల్లో కూడా భక్తులు చెత్త వేయడం, మలమూత్ర విసర్జన చేస్తున్నారని ప్రయాగ్ రాజ్ ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్య సిబ్బంది ప్రయత్నాలు జరిగినప్పటికీ పరిస్థితి మెరుగుపడటం లేదు. ప్రయాగ్రాజ్ ప్రజలు ఇప్పుడు భక్తులను తాత్కాలికంగా రాకుండా కోరుతూ.. “గంగా, త్రివేణి సంగమం ఎప్పుడైనా స్నానం చేయవచ్చు, ప్రస్తుతం రావద్దు” అని అభ్యర్థిస్తున్నారు.