Visakhapatnam News: విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ ప్రాంతంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడి చేయడమే కాకుండా.. అంతే కాకుండా యువతిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చేదు అనుభవంపై ఆ యువతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇబ్బంది పడుతున్నా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరూ స్పందించలేదని ఆమె తన పోస్ట్లో పేర్కొంది.
యువతి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విశాఖ పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. నిందితుడి గురించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక విచారణ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని మహారాణిపేట పోలీసులు వెల్లడించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు.
ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటన జరిగిన వెంటనే కేసును ఛేదించిన విశాఖ పోలీసుల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ప్రవర్తించే వారు ఎవరైనా సరే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని సీఎం స్పష్టం చేశారు. విశాఖలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయనడానికి పోలీసుల వేగవంతమైన స్పందనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
విశాఖ పోలీసుల పనితీరు ప్రశంసించిన సీఎం చంద్రబాబు
పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు
మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా నిర్ధారణ
స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు https://t.co/w8eyR4QLvC pic.twitter.com/D1MixZeMoz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2026