10th Class Exams: పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకుని.. ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో కూడా ఇదే విధానాన్ని తప్పనిసరిగా అనుసరించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బోధన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో.. సోమవారం రాష్ట్ర ఉన్నతాధికారులు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ, ఇన్విజిలేషన్, మూల్యాంకనం, విద్యార్థుల పర్యవేక్షణ తదితర అంశాలపై పలు కీలక సూచనలు జారీ చేశారు.
ఇకపై పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపును.. పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో జరిగే ఈ ప్రక్రియలో కొన్ని చోట్ల అవకతవకలకు అవకాశముంటుందని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై కేంద్ర స్థాయి నియంత్రణను తీసుకురావాలని నిర్ణయించింది. అదే విధంగా, జవాబు పత్రాల మూల్యాంకనానికి అవసరమైన ఉపాధ్యాయులను కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే ఎంపిక చేయనున్నారు.
ఒక్కో జవాబు పత్రాన్ని పరిశీలించేందుకు కనీసంగా 12 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించాల్సిందేనని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తొందరపాటు మూల్యాంకనం వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి జవాబు పత్రాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. మూల్యాంకనంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 15వ తేదీ తర్వాత పదో తరగతి విద్యార్థులను ఎటువంటి ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదని పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సభలు, శిక్షణ శిబిరాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో విద్యార్థుల చదువుకు భంగం కలిగించరాదని అధికారుల సూచన. ప్రతి రోజూ పరీక్షలు నిర్వహించి, వాటి మార్కులను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
రోజువారీగా నిర్వహించే స్లిప్ టెస్ట్ల సమాధాన పత్రాలను పబ్లిక్ పరీక్షల ముగింపు వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. అవసరమైతే ఈ పత్రాలను పరిశీలించి విద్యార్థుల అకాడమిక్ ప్రగతిపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల బలహీనతలను గుర్తించి తగిన మార్గదర్శనం అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
Also Read: రాజధాని రైతులు ఫుల్హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!
ఇదిలా ఉండగా, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే ఎఫ్ఎల్ఎన్ సర్వేను కూడా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమగ్రంగా చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేవలం గణాంకాల కోసం కాకుండా, పిల్లల చదువు, లెక్కల ప్రాథమిక స్థాయిని పటిష్టం చేసే దిశగా ఈ సర్వే ఉపయోగపడేలా విధానాన్ని అమలు చేయాలని సూచించారు.