AP Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఒకే సారి రెండు వాయుగుండాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మలేషియా, మలక్కా జలసంధి ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు..
ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా చూపనుంది. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్-నికోబార్, ఏపీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. రెండు రోజుల్లో తుఫాన్ గమనం, తీవ్రతపై స్పష్టత వస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఏపీ, తమిళనాడులపై వాయుగుండం ఎఫెక్ట్..
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, భూమధ్యరేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర- వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ్టికి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం మరింత బలపడి.. ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని చెబుతోంది. వాయుగుండం ఎఫెక్ట్ ఏపీ, తమిళనాడులపై ఉంటుందని హెచ్చరిస్తుంది.
29 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఈనెల 29 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని హెచ్చరించింది. 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణాతో పాటు.. ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: 12 వేల ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. ఢిల్లీని తాకిన బూడిద మేఘాలు.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే!
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. 45-50 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీచనుండటంతో.. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.