Hyderabad News: హైదరాబాద్ సిటీ మరింత విస్తరించిందా? దేశంలో అతి పెద్ద సిటీగా మారనుందా? 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత పరిధి అమాంతంగా పెరిగిందా? దీంతో జీహెచ్ఎంసీ కొత్త రూపం సంతరించుకోనుందా? మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ మారనుందా? మార్చిలో నోటిఫికేషన్ రానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
దేశంలో అతి పెద్ద సిటీ హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరం విస్తరించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ విస్తీర్ణత 650 చదరపు కిలోమీటర్లు. 27 మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాలను వెనక్కి నెట్టేసింది. అంతర్జాతీయంగా హైదరాబాద్ సిటీకి ప్రాచుర్యం పొందనుంది.
ఆరు పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలో బిగ్గెస్ట్ సిటీగా హైదరాబాద్ మారనుంది. మున్సిపాలిటీలను విలీనం చేయాలనే ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉందని, ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేస్తోందని మీడియా సమావేశంలో మంత్రులు స్వయంగా చెప్పారు.
మూడు కార్పొరేషన్లు, మార్చిలో ప్రకటన?
శీతాకాలం లేదంటే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేయనుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా మొదలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా దాదాపు కోటిన్నరగా అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తే దాదాపు రెండు కోట్ల వరకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. అందుకు అనుగుణంగా సదుపాయాలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం.
విలీనం పూర్తయ్యాక జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లు విభజిస్తారు? అనేది అసలు ప్రశ్న. మంగళవారం జరిగిన కేబినెట్లో దానిపై చర్చించలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత 27 మున్సిపాలిటీల విలీనానికి చట్ట సవరణలు చేయనుంది. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా మిగతా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు అధికారులు.
ALSO READ:మంచినీటితో కారు క్లీనింగ్.. ఆపై భారీ జరిమానా
విలీనం తర్వాత జీహెచ్ఎంసీ ఒకే పాలకమండలిగా ఉంటుందా అన్నది అసలు ప్రశ్న. పాలనా కోసం వికేంద్రీకరణ చేస్తారా? అనే సందేహాలు లేకపోలేదు. మూడు పోలీసు కమిషనరేట్ల మాదిరిగానే జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్పు చేస్తారని జోరుగా సాగుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో అన్నిప్రాంతాలను కమిషనర్ పర్యవేక్షణ చేయలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తికావచ్చని అంటున్నారు. విలీన తర్వాత ఎన్ని కార్పొరేషన్లు, వార్డులుగా విభజించాలనే దానిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేశారు.
ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇప్పటికే నివేదిక ఇచ్చినట్టు చెబుతున్నారట. వాటిలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వ వర్గాల మాట. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు జీహెచ్ఎంసీ ప్రత్యేక పాలన కిందకు వెళ్లవచ్చని అంటున్నారు.