Cybercrime: ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగుచూసిన ఈ భారీ సైబర్ మోసం సమాజంలో పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ నేరాలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. అత్యాధునిక సాంకేతికతను, మానసిక భయాన్ని ఆయుధంగా చేసుకుని ఏకంగా రూ. 1.23 కోట్లు కాజేశారు.
నిందితులు తొలుత నాగేశ్వరరావుకు ఫోన్ చేసి.. ఆయన ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో డూప్లికేట్ బ్యాంక్ ఖాతా తెరిచారని.. ఆ ఖాతా ద్వారా భారీ ఎత్తున హవాలా లావాదేవీలు (మనీ లాండరింగ్) జరుగుతున్నాయని నమ్మించారు. ఈ కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉందని.. సుప్రీంకోర్టు, సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరుగుతోందని భయపెట్టారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బయట ఎవరికీ చెప్పకూడదని ‘గోప్యత’ పేరుతో ఒత్తిడి తెచ్చారు.
నేరగాళ్లు నాగేశ్వరరావును, ఆయన భార్యను దాదాపు పది రోజుల పాటు ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. అంటే.. వీడియో కాల్ ద్వారా నిరంతరం వారిపై నిఘా ఉంచారు. వీడియో కాల్లోనే వారి ఇంటిని శోధించినట్లు నటించి, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గృహనిర్భంధం చేశారు. వారు యూనిఫాంలో ఉండి, ఆఫీస్ సెటప్ను చూపించి నిజమైన పోలీసులమని భ్రమ కలిగించారు. విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి.. తన వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని ‘సెక్యూరిటీ డిపాజిట్’ పేరుతో వివిధ విదేశీ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ. 1.23 కోట్లు కాజేశారు.
బాధితుడి వద్ద ఉన్న నగదు మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేరగాళ్లు వదల్లేదు. ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బును జమ చేయాలని ఒత్తిడి చేయడంతో నాగేశ్వరరావుకు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన అద్దంకి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అద్దంకి సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ విభాగం వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేయదు లేదా ఇంట్లో నిర్బంధించదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.