Bhuma Akhila Priya Arrest(AP politics): టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయ్యారు. నంద్యాలలో సీఎం జగన్ సభ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నిన్నటి నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండోరోజు ఈ బస్సుయాత్రను నంద్యాల నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాలలో వైసీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది.
Also Read : ఏపీలో కంటెయినర్ పంచాయితీ.. ఇంతకీ అసలు కథేంటి?
వైసీపీ సభకు ముందు ఎర్రగుంట్లలో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన అఖిలప్రియ.. సాగునీటి సమస్యను పరిష్కరించేలా నీటిని విడుదల చేయాలని కోరుతూ.. జగన్ కు వినతిపత్రాన్ని అందించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో పాటు టిడిపి శ్రేణులు కూడా భారీగా తరలివచ్చారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు అఖిలప్రియ, టిడిపి శ్రేణులను అడ్డుకున్నారు. పోలీసులకు, అఖిలప్రియకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును ఖండించిన అఖిలప్రియ.. పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వెంటనే అఖిలప్రియతో పాటు టిడిపి శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ అరెస్ట్ తో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కాగా.. పోలీసుల తీరుపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
కాగా.. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే ఇలా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు టిడిపి నేతలు. అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదని.. అందుకే సీఎంనే నేరుగా కలిసి వినతిపత్రం ఇవ్వాలని వచ్చినట్లు అఖిలప్రియ పేర్కొన్నారు.