Alluri district: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నర్సింగపేట గ్రామంలో ఒక చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక చెరువు తండ్రీకొడుకుల పాలిట మృత్యుకుహరంగా మారింది. ఆదివారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. మృతులు సింహద్రి పాపారావు, ఆయన కుమారుడు యశ్వంత్. గ్రామానికి సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న తమ కోడి పుంజును పట్టుకోవడానికి వీరు ప్రయత్నించారు. ఆ సమయంలో కోడి పుంజును వెంబడిస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ఆ చెరువు లోతుగా ఉండటంతో ఇద్దరికీ ఈత రాక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
చాలా సమయం వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే.. చెరువు గట్టుపై విడిచిన చెప్పులను చూసి స్థానికులకు అనుమానం కలిగింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్ రప్పించారు. దాదాపు గంటల తరబడి గాలించిన తర్వాత తండ్రీకొడుకుల మృతదేహాలను బయటకు తీశారు.
నిన్న మొన్నటి వరకు కళ్లముందే తిరిగిన తండ్రీకొడుకులు ఇలా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఒక కోడి పుంజు కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
ALSO READ: Sangareddy Crime: పెళ్లి పేరుతో యువతి ఉసురు తీశాడు.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో బంధువుల ధర్నా!