Bhogapuram Aiport: భోగాపురం ఎయిర్పోర్టులో కార్యక్రమాలు మెల్లగా మొదలవుతున్నాయి. ఆగష్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. అంతకుముందు నుంచే ప్రత్యేక విమానాలు అక్కడ ల్యాండింగ్ కావడం కనిపించింది. ఢిల్లీ నుంచి నేరుగా రాజకీయాలు ప్రత్యేక విమానంలో అక్కడ దిగారు.
ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు క్రమంగా మొదలవుతున్నాయి. అధికారికంగా ఈనెల 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతకు నాలుగురోజుల ముందు నుంచి ప్రత్యేక విమానాల రాకపోకలు జోరందుకున్నాయి. ఢిల్లీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టులో దిగారు.
తొలిసారి భోగాపురంలో ల్యాండింగ్ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించి ఫోటోలను షేర్ చేసుకున్నారు. అదే సమయంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావులు ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నేతలంతా ఎదురెదురుపడడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.
ఆగష్టు ఒకటిన విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. పౌర విమానాల రాకపోకలు ఆగస్టు 17 నుంచి మొదలుకానున్నాయి. నేతలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాలుగు రోజులు ముందుగా భోగాపురం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలతో సందడి మొదలైంది.
ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16న సింగపూర్-విశాఖ విమానం భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. 17న అర్ధరాత్రి తిరిగి భోగాపురం నుంచి సింగపూర్కు ఆ విమానం బయలుదేరనునంది. భోగాపురం నుంచి విమానాల రాకపోకలు మొదలుకాగానే విశాఖపట్నం నుంచి విమానాలను నిలిపేస్తున్నట్లు ఇటీవల పౌరవిమానయానశాఖ వెల్లడించింది.
ALSO READ: ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్
కేవలం జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అక్కడ మినహాయింపు ఉంటుంది. కేంద్రబలగాలకు సంబంధించిన విమానాలు, ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ ఎయిర్క్రాఫ్ట్లకు మాత్రం అనుమతి ఉండనుంది. భోగాపురం నుంచి విమాన సర్వీసులకు సంబంధించి ఎయిరిండియా తమ విమానాల షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్ టు భోగాపురం రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు నుంచి భోగాపురానికి రోజుకు రెండు సర్వీసులు తిరగనున్నాయి. విజయవాడ- భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా పేర్కొంది. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఈనెల 15 నుంచి ఏరో ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక బస్సులు నడపనుంది.