Chandrababu Naidu: అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అందుబాటులో ఉన్న మంత్రులు లంచ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 వివాదం, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. అసెంబ్లీలో ఎండగడదాం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ అనుకూలురకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికే అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేశారని మంత్రులు మండిపడ్డారు. చివరికి డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలను దిద్దించడం ఏంటని, పత్రికలు, ఛానళ్లలో వస్తున్న కథనాలు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై వైసీపీని గట్టిగా ఎండగట్టాలని మంత్రులు నిర్ణయించారు.
సిట్ నివేదిక & మరిన్ని విచారణలు
ఈ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం , ఇచ్చిన నివేదికపై భేటీలో ప్రధానంగా చర్చించారు. నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎస్.ఆర్. ఆంజనేయులు పాత్రతో పాటు వైసీపీకి చెందిన పలువురు పెద్దలు, మరికొందరు అధికారుల ప్రమేయంపై మరింత లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని మంత్రులు కోరారు. అయితే, ప్రస్తుతం ఈ సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయస్థానం ఇచ్చే నిర్ణయాన్ని చూసి తదుపరి చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా 2011లో మహారాష్ట్రలోనూ ఇలాంటి అక్రమాలు జరిగితే అక్కడ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని మంత్రులు గుర్తుచేశారు.
బాధితులతో మాట్లాడాలని సీఎం ఆదేశం
న్యాయం కోసం కోర్టు మెట్లుెక్కిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే ఈ అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు, లోతైన సమాచారం లభిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. దీనికి వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు.. ఆ అభ్యర్థులతో వెంటనే మాట్లాడి, సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. అలాగే, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన ప్రమేయాలపై నిఘా పెట్టేందుకు పోలీస్ శాఖలోని కొందరు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు తెలిసింది.
వైసీపీ దాడికి ప్రతిదాడి – డిఎస్సీపై సవాల్
మరోవైపు శాసనమండలిలో డిఎస్సీ (DSC) నిర్వహణపై వైసీపీ అవకతవకల ఆరోపణలు చేసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అయితే, డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, వైసీపీ చేసే ప్రతి ఆరోపణకూ సాక్ష్యాధారాలతో సహా అగ్రెసివ్గా కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ‘కేవలం ఆరోపణలు చేసి వెళ్లిపోతామంటే కుదరదు.. మన పొలిటికల్ ఎటాక్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి’ అని సీఎం స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే తీసుకురావాలని వైసీపీకి సవాల్ విసిరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణాలు.. సైబరాబాద్ అనుభవాలు
రాజధాని అమరావతిలో పనులు వేగంగా ఊపందుకుంటున్నాయని, త్వరలోనే వరుసగా ప్రారంభోత్సవాలు చేసుకుందామని సీఎం మంత్రులతో అన్నారు. ఇదే సమయంలో గతం లో సైబరాబాద్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR), హైటెక్ సిటీ నిర్మాణాల సమయంలో తనకు ఎదురైన అనుభవాలను, ఆ ప్రాజెక్టులను సక్సెస్ చేసిన తీరును చంద్రబాబు మంత్రులతో పంచుకున్నారు.
Also Read:డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!