Amaravati Land Pooling: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అత్యంత కీలకమైన రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. మొత్తం 9 యూనిట్లను ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే 7 కార్యాలయాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచే ఆయా యూనిట్లకు బోర్డులు ఏర్పాటు చేసి, సిబ్బందికి భూముల వివరాల నమోదు, ఫార్మాట్ల నిర్వహణ, దస్త్రాల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పెదపరిమిలో రెండు యూనిట్లను వేర్వేరుగా కాకుండా, సౌలభ్యం కోసం ఒకే చోట నిర్వహించాలని నిర్ణయించారు.
సమీకరణ ప్రక్రియకు సంబంధించి తుళ్లూరు, అమరావతి తహశీల్దార్లు ఆయా గ్రామాల వారీగా భూముల వివరాలు, రైతుల జాబితాలతో కూడిన సమగ్ర నివేదికలను సిద్ధం చేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, సీఆర్డీఏ కార్యాలయానికి పంపించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు అదనంగా ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉండటంతో, రానున్న రెండు రోజుల్లో వారి నియామకాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. అలాగే సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణంలో ఏవైనా మార్పులు ఉంటే వాటిని కూడా అధికారులు సరిచూస్తున్నారు.
నేడు రెండో దశ పూలింగ్ పరిధిలోని గ్రామాల్లో అధికారులు పర్యటించనున్నారు. ప్రధానంగా 20,494 ఎకరాలకు సంబంధించిన రైతుల సంఖ్యలో గణాంక పరమైన వ్యత్యాసాలు ఉండటంతో వాటిని క్షేత్రస్థాయిలో సరిచూసుకోనున్నారు. పూలింగ్ పరిధిలో ఉన్న అటవీ, కొండ పోరంబోకు భూముల్లో కొంతమంది సాగుదారులు ఉండటం, మరికొందరికి పట్టాలు కూడా ఉండటంతో.. వారిని ఏ కేటగిరీ కింద పరిగణించాలనే దానిపై అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. అలాగే గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను పూలింగ్లో ఏ విధంగా నమోదు చేయాలనే అంశంపై రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోరినట్లు సమాచారం.
Read Also: డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్